ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి సీఎం అవుద్దామనుకున్న కేసీఆర్

Telugu Lo Computer
0


తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్‌ పై బీజేపీ నేత, మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం ఈ ప్రపంచంలో మరెవ్వరికీ లేదని విరుచుకుపడ్డారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబును గద్దె దించేసి.. ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టేందుకు కుట్రలు చేశారని ఆరోపించారు. కానీ ఈ విషయం చంద్రబాబుకు తెలియడంతో కుట్రకు తెరపడిందని చెప్పారు చంద్రశేఖర్. ఉద్యమ సమయంలో కూడా ఎంతో మందిని తన మాటలతో మోసం చేశారని విమర్శించారు. తనను ముఖ్యమంత్రిని చేస్తానని, మధుసూదనాచారి సహా చాలా మందిని మంత్రుల్ని చేస్తానని చెప్పి.. మోసగించారని విరుచుకుపడ్డారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా.. హైదరాబాద్‌లో గురువారం బీజేపీ నిర్వహించిన 'అమరుల యాదిలో తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సభలో మాట్లాడుతూ  చంద్రశేఖర్ ఈ వ్యాఖ్యలు చేశారు. '' కేసీఆర్‌కు అధికార దాహం ఏ స్థాయిలో ఉంటుందో తెలియడానికి మీకో ఉదాహరణ చెప్పాలి. 2001లో టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటయింది. కానీ అంతకంటే ముందు నేను, కేసీఆర్ ఒకేసారి మంత్రులమయ్యాం. ఆ తర్వాతి ఎన్నికల్లో కేసీఆర్‌కు మంత్రి పదవి ఇవ్వలేదు. కేసీఆర్‌కు అధికార దాహం చాలా ఎక్కువ. మంత్రి పదవి రానందుకు చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి కూడా ఎమ్మెల్యేల్లో చీలిక తెచ్చేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారు. దీని గురించి నాతో పాటు బొజ్జల గోపాలకృష్ణయ్య, మరికొందరిని కలిశారు. 3, 4నెలల పాటు చర్చలు జరిపాయి. దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబుకు వ్యతిరేకంగా అయ్యారు. 60 మంది ఒక్కటైనందున మనకు సీఎం పదవి దగ్గరగా వస్తుంది.. మనకు ఈ 60 మంది చాలు అని కేసీఆర్ చెప్పారు. 20 హెలికాప్టర్లలో అందరం గవర్నర్‌ వద్దకు వెళ్దామని అన్నారు. ఈ విషయం చంద్రబాబుకు తెలిస్తే గవర్నర్ వరకు వెళ్లనీయరని.. అందుకే ఎలాగైనా గవర్నర్‌ వద్దకు వెళ్దామని ప్లాన్ చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి కావాలన్నది సీఎం కేసీఆర్ ఆకాంక్ష. కానీ 61వ ఎమ్మెల్యేగా వచ్చిన జ్యోతుల నెహ్రూ అక్కడి నుంచి చంద్రబాబు వద్దకు వెళ్లడంతో..ఆ ప్రణాళిక బెడిసికొట్టింది. కేసీఆర్‌కు ఉన్నంత అధికార దాహం ఈ ప్రపంచంలో ఎవరికీ ఉండదు.'' అని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. కేంద్రంపై కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లోనూ కేంద్రాన్ని టార్గెట్ చేసుకొని విమర్శలు గుప్పించారు. తెలంగాణు కేంద్రం గుదిబండగా మారిందని.. స్వరాష్ట్రం వచ్చినా హక్కుల కోసం పోరాడాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శలు గుప్పించారు. తెలంగాణ వాటా నిధులను నిస్సిగ్గుగా ఎగ్గొడుతుందని దుయ్యబట్టారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు సీఎం కేసీఆర్. అటు బీజేపీ కూడా తెలంగాణపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. ఎన్నడూ లేని విధంగా.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఢిల్లీలో నిర్వహించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ టార్గెట్‌గా హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. తెలంగాణకు 2.52 లక్షల కోట్ల నిధులను ఇచ్చామని.. కేసీఆర్ అప్పుడప్పుడైనా నిజాలను చెప్పాలని సెటైర్లు వేశారు. ఏ రాష్ట్రంపైనా కేంద్రం సవతి తల్లి ప్రేమ చూపదని అమిత్ షా స్పష్టం చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)