'ఈ రోజు రూ.వందల కోట్ల కంపెనీకి యజమానిగా ఉన్న నేను ఒకప్పుడు నా వ్యాపారం ప్రారంభించేందుకు 920 రూపాయల కోసం కష్టాలు పడ్డాను' అని ప్రముఖ వజ్రాల వ్యాపారి గోవింద్ ఢోలకియా తన ఆత్మకథలో గతాన్ని గుర్తు చేసుకొన్నారు. 'డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్, సో ఆర్ మోరల్స్' పేరిట వెలువడిన ఈ ఆత్మకథకు సహ రచయితలుగా అరుణ్ తివారి, ఢోలకియా సహాయకుడైన కమలేశ్ యాజ్ఞిక్ వ్యవహరించారు. వజ్రాల తయారీ, ఎగుమతుల కంపెనీ 'శ్రీ రామకృష్ణ ఎక్స్పోర్ట్స్ ప్రయివేట్ లిమిటెడ్' వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అయిన గోవింద్ ఢోలకియా 'నా జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోడానికి ఉన్నతమైన విలువలే సాయం చేశాయి' అని వివరించారు. 1970 ప్రాంతంలో తన సొంత వ్యాపారాన్ని ప్రారంభించిన రోజులను ఆయన గుర్తు చేసుకొన్నారు. 'వజ్రాలు మెరుగు పట్టడానికి రూ.920 పెట్టుబడి అవసరమైంది. నా వద్ద రూ.500 మాత్రమే ఉన్నాయి. స్నేహితుడి ఇంటికి వెళ్లా. ఇంటిఖర్చుల కోసం పెట్టుకొన్న రూ.200 ఇచ్చారు. పక్కింటి నుంచి అప్పు తీసుకువచ్చి మిగతా డబ్బు కూడా సర్దారు. పాలిష్ పెట్టిన వజ్రాలకు పది శాతం లాభం వచ్చింది. నా పని వాళ్లకు నచ్చడంతో మరిన్ని ఆర్డర్లు ఇచ్చారు. వజ్రాలు నాకు దేవుడితో సమానం' అంటారు ఢోలకియా.