తెలంగాణ లోని మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల కేంద్రంలోని బీసీ హాస్టల్ విద్యార్ధులు ఫేర్ వెల్ పార్టీలో భాగంగా చికెన్ వండించుకున్నారు. హాస్టల్ కుక్ చికెన్ వండి వెళ్లి పడుకుంది. వార్డెన్ కూడా రాత్రి తొమ్మిదిన్నర వరకు ఉండి వెళ్లిపోయాడు. ఆ రోజు వాచ్మెన్ కూడా లేడు. దీంతో పదో తరగతి చదువుతున్న బయటి విద్యార్ధులతో బీర్ బాటిల్స్ తెప్పించుకున్నారు. అందరూ పడుకున్న తరువాత మందు, మాంసంతో పార్టీ చేసుకున్నారు. పదో తరగతి విద్యార్ధులు బీర్లు తాగడం, ఆ ఫొటోలు బయటకు రావడంతో ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ చేయాలంటూ బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్కు దేశాలు జారీ చేశారు. దర్యాప్తులో విద్యార్ధులు మద్యం సేవించింది నిజమేనని తేల్చారు. పదో తరగతి అయిపోతోంది కదా పార్టీ చేసుకుంటాం అనగానే తన సొంత డబ్బులతో హాస్టల్ వార్డెన్ మల్లేష్ చికెన్ తీసుకొచ్చి వండించాడు. అందరూ తినే సమయంలో కాకుండా ప్రత్యేకంగా వారి గదిలోకి చికెన్ తీసుకెళ్లారు. ఎలాగూ తిని పడుకుంటారు కదా అని రాత్రి తొమ్మిదిన్నరకు వార్డెన్ కూడా వెళ్లిపోయాడు. వార్డెన్, వంట మనిషి వెళ్లిపోయిన తరువాత బయటి స్టూడెంట్స్కి సమాచారం అందించారు. అక్కడి నుంచి బీర్ బాటిల్స్ రావడంతో.. చికెన్ను స్టఫ్గా పెట్టుకుని మద్యం లాగించారు పదో తరగతి హాస్టల్ విద్యార్ధులు. బీర్లు తాగామని పదో తరగతి విద్యార్ధులు ఒప్పుకోవడంతో.. వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు. విద్యార్ధుల తల్లిదండ్రులకు కూడా సమాచారం అందించామని చెప్పుకొచ్చారు. ఈ ఘటనలో హాస్టల్ వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు కనబడుతోంది కాబట్టి.. అయనపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. బీసీ హాస్టల్ విద్యార్ధులు క్రమశిక్షణ తప్పి ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తున్నారు చుట్టుపక్కల వాళ్లు. విద్యార్ధులను అదుపు చేయాలని ఎన్నిసార్లు చెప్పినా అధికారులెవరూ పట్టించుకోవడం లేదని చెబుతున్నారు.
మందు, మాంసంతో టెన్త్ విద్యార్ధులు ఫేర్వెల్ పార్టీ
April 20, 2022
0
Tags