కల వచ్చిందంటే ఖతం !

Telugu Lo Computer
0


రాచకొండ పోలీసులు ఎంతో కాలంగా వెతుకుతున్న గజదొంగ ఎట్టకేలకు చిక్కాడు. ఎక్కడెక్కడా అని వెతుకుతుంటే ఫుట్‌పాత్‌పై జీవనం సాగిస్తూ దొరికిపోయాడు. అతని వద్ద నుంచి రూ.1.30 కోట్ల విలువ చేసే సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘరానా దొంగకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ముచ్చు అంబేద్కర్ అలియాస్ రాజు అలియాస్ రాజేష్, అలియాస్ ప్రసాద్, అలియాస్ రాజేందర్ ప్రసాద్ అరెస్ట్ చేసామని రాచకొండ సీపీ మహేష్ భగవత్ తెలిపారు. గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన అంబేద్కర్ 1989 నుండి నేరాలకు పాల్పడుతున్నాడు. ఇందిరా పార్కు దగ్గర ఎలక్ట్రానిక్ వర్క్ చేస్తూ ఉంటాడు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పరిధిలో మొత్తం 21 కేసులు అతనిపై నమోదయ్యాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హైదరాబాద్‌లో రాజు ఉండే ఫుట్‌పాత్ పైనే. కానీ సొంతూర్లో మాత్రం పెద్ద సంపన్నుడు. స్వగ్రామంలో మూడంతస్తుల భవనం నిర్మించాడు. అయితే, రాజు ఎలా పడితే అలా దొంగతనం చేయడట. అతనికి వచ్చే కలల ఆధారంగానే చోరీలకు పాల్పడుతాడట. తన కలలోకి ఏ ఇల్లు వస్తే ఆ ఇంట్లో తన పని మొదలు పెడతాడు. అంతేకాదు దొంగతనానికి వెళ్లాలా? వద్దా? అనే విషయంలో క్లారిటీ కోసం చిట్టీలు వేస్తాడట. ఆ చిట్టీల ఆధారంగా దోపిడీ చేయాలా? వద్దా? అని నిర్ణయించుకుంటాడు. పోలీసులు తమ ప్రాథమిక విచారణలో ఈ విషయాలు తెలుసుకుని షాక్‌ అయ్యారు. ఇలా దోచుకున్న సొమ్మును బయట అమ్మితే పోలీసులకు దొరికిపోతాననే ఉద్దేశ్యంతో ఎక్కడా అమ్మేవాడు కాదట. దొంగతనం చేసిన వస్తువులన్నింటినీ ఇంట్లో భద్రంగా దాచి పెట్టేవాడు. రాజు మొత్తం 43 దొంగతనాలకు పాల్పడగా అతని వద్ద నుంచి 230 తులాల బంగారం, 10.2 కేజీల వెండి, రూ.18 నగదును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మొత్తం రూ.1.30 లక్షలకు పైగా సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు రాజును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)