రష్యా చమురు కొనడం ఆంక్షల ఉల్లంఘన కాదు

Telugu Lo Computer
0


ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యాపై ఆంక్షలు అమలవుతున్న నేపథ్యంలో రష్యా నుంచి భారత దేశం క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవడం ఆ ఆంక్షలను ఉల్లంఘించడం క్రిందకు రాదని అమెరికా స్పష్టం చేసిందిఈ దిగుమతులు ప్రస్తుతానికి భారత్ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో 1 నుంచి 2 శాతం వరకు మాత్రమే ఉన్నందువల్ల ఆంక్షలను ఉల్లంఘించినట్లు పరిగణించడం లేదని తెలిపింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వర్చువల్ సమావేశం అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ జెన్ సాకీ సోమవారం పొద్దుపోయాక మీడియాతో మాట్లాడారు. రష్యన్ చమురును భవిష్యత్తులో కొనడంపై ప్రధాన మంత్రి మోదీ నుంచి బైడెన్ హామీ పొందారా? అని ప్రశ్నించినపుడు జెన్ సాకీ మాట్లాడుతూ, రష్యా నుంచి భారత్ కేవలం 1 నుంచి 2 శాతం చమురును మాత్రమే దిగుమతి చేసుకుంటోందని, అందువల్ల రష్యాపై విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించినట్లు పరిగణించడం లేదని చెప్పారు. రష్యా నుంచి చమురు దిగుమతులను పెంచుకోవడం భారత దేశ ప్రయోజనాలకు సరికాదని మోదీకి బైడెన్ చెప్పారన్నారు. ఇంధనం దిగుమతులను నిషేధించలేదన్నారు. తాము విధించిన ఆంక్షలను భారత్ ఉల్లంఘించలేదన్నారు. ప్రతి దేశం తన ప్రయోజనాల కోసం అడుగులు వేస్తుందనే విషయాన్ని గుర్తించినట్లు తెలిపారు. ప్రధాని మోదీ, భారతీయులు ఈ విషయంపై మాట్లాడాలన్నారు. భారత్ చమురును దిగుమతి చేసుకునేందుకు అవకాశాలను పెంచడానికి అమెరికా సిద్ధంగా ఉందని మోదీకి బైడెన్ చెప్పారన్నారు. రష్యా నుంచి భారత్ దిగుమతి చేసుకుంటున్న చమురు కన్నా అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న చమురు చాలా ఎక్కువ అని తెలిపారు. జెన్ సాకీ సమాధానంతో అమెరికా విధానంలో భారీ మార్పు వచ్చినట్లు స్పష్టమవుతోంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)