ప్రాంతీయ సహకారం ఎంతో అవసరం : మోదీ

Telugu Lo Computer
0


రష్యా ఉక్రెయిన్ యుద్ధ కారణంగా యూరోప్ సహా అంతర్జాతీయంగా నెలకొన్న సందిగ్థతల నడుమ ప్రస్తుతం ప్రాంతీయ దేశాల మధ్య సహకారం ఎంతో అవసరమని ప్రధాని మోదీ అన్నారు. బిమ్స్‌టెక్ 5వ శిఖరాగ్ర సమావేశం పురస్కరించుకుని ప్రధాని మోదీ వర్చువల్ విధానం ద్వారా సభ్య దేశాధినేతలతో సమావేశం అయ్యారు. బంగాళాఖాతం తీర ప్రాంత దేశాలైన భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, నేపాల్ మరియు భూటాన్ ల మధ్య పరస్పర అభివృద్ధి, ప్రాంతీయ సహకార నిమిత్తం బిమ్స్‌టెక్ ను ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ ఏడాది బిమ్స్‌టెక్ శిఖరాగ్ర సమావేశానికి శ్రీలంక ప్రాతినిధ్యం వస్తుంది. బుధవారం జరిగిన ఈ సమావేశానికి ఆయా దేశాధినేతలు వర్చువల్ విధానం ద్వారా హాజరుఅయ్యారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ సభ్య దేశాల మధ్య సహకారాన్ని మరింత పెంపొందించాల్సి ఉందని అన్నారు. సభ్య దేశాల మధ్య రోడ్డు, రవాణా వ్యవస్థను బలోపేతం చేసే విధంగా మాస్టర్ ప్లాన్‌ను రూపొందించడం ఈ సమావేశంలో తీసుకోవాల్సిన ప్రధాన నిర్ణయంగా మోదీ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ, గత కొన్ని వారాలుగా యూరప్‌లో జరుగుతున్న పరిణామాలు అంతర్జాతీయ స్థిరత్వంపై ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని మోదీ అన్నారు. ఇటువంటి సమయంలోనే బిమ్స్‌టెక్ సభ్య దేశాలు పరస్పర ప్రాంతీయ సహకారాన్ని మరింత చురుగ్గా ముందుకు తీసుకువెళ్లాలని అన్నారు. ప్రాంతీయ భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వడం కూడా అత్యవసరమని మోదీ సూచించారు. బిమ్స్‌టెక్ కార్యాచరణను ముందుకు తీసుకువెళ్లే విధంగా భారత్ తరుపున $1 మిలియన్ డాలర్లు అందజేస్తున్నామని మోదీ వివరించారు. సభ్య దేశాల మధ్య రహదారి కనెక్టివిటీని పెంచడానికి మరియు బంగాళాఖాతంలో 'కోస్టల్ షిప్పింగ్ ఎకోసిస్టమ్'ను ఏర్పాటు చేయడానికి చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌ను ఏర్పాటు చేయాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. 'ప్రాంతీయంగా సభ్య దేశాలు ఆరోగ్యం, ఆర్థిక భద్రత వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నామని, ఈ సమయంలో ఐక్యత మరియు సహకారం ఎంతో అవసరమని మోదీ అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)