ఫ్లాట్ల విక్రయాలు తగ్గిపోయాయి..!

Telugu Lo Computer
0


తెలంగాణ రిజిస్ర్టేషన్‌, మార్కెట్‌ విలువల పెరుగుదలతో ఫిబ్రవరిలో రూ.25లక్షల లోపు విలువైన రెసిడెన్షియల్‌ ఫ్లాట్ల విక్రయాల జోరు తగ్గింది. ఫిబ్రవరి నెలలో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌- మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో 5,146 ఫ్లాట్ల విక్రయాలతో రూ. 2,772 కోట్ల విలువగల నివాస గృహాల రిజిస్ర్టేషన్లు జరిగినట్లుగా నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా నివేదిక విడుదల చేసింది. ప్రధానంగా మేడ్చల్‌- మల్కాజిగిరి జిల్లాలో 39 శాతం, రంగారెడ్డిలో 37, హైదరాబాద్‌లో 20 శాతం అమ్మకాలు జరిగినట్లు నివేదికలో పేర్కొన్నారు. 25 లక్షలలోపు విలువైన ఆస్తుల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. ఫిబ్రవరి 2021లో 42 శాతం అమ్మకాలు జరగగా, 2022 ఫిబ్రవరిలో 16 శాతానికి పడిపోయాయి. రూ.25- 50 లక్షలు, రూ.50-75 లక్షలు, రూ.75 లక్షలకు పైగా విలువైన ఫ్లాట్ల రిజిస్ర్టేషన్లలో పెరుగుదల కనిపిస్తోంది. రూ.25- 50 లక్షల విలువ గల ఫ్లాట్ల విక్రయాల్లో 34 శాతం నుంచి 52 శాతానికి పెరుగుదల కనిపించిందని నివేదికలో వెల్లడించారు. ఫిబ్రవరిలో జరిగిన అమ్మకాల్లో సింహభాగం 1000-2000 చదరపు అడుగుల గృహాలు నమోదయ్యాయి. 2021 ఫిబ్రవరిలో వెయ్యినుంచి రెండువేల చదరపు అడుగుల గృహాల్లో 70 శాతం అమ్మకాలు నమోదు కాగా, ఈ సంవత్సరం 74 శాతం విక్రయాలు నమోదైనట్లు నివేదికలో వెల్లడించారు. కొన్నేళ్ల నుంచి అమ్మకాల ధర పెరుగుదల విషయంలో హైదరాబాద్‌ రెసిడెన్షియల్‌ మార్కెట్‌ చాలా బలంగా ఉంటుందని నైట్‌ ఫ్రాంక్‌ ఇండియా చైర్మన్‌ శిశిర్‌ బైజాల్‌ తెలిపారు.


Post a Comment

0Comments

Post a Comment (0)