ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ విస్తరణపై కొనసాగుతున్న సస్పెన్స్కు ఎట్టకేలకు తెరపడింది. త్వరలోనే కేబినెట్ విస్తరణ ఉంటుందని, కేబినెట్ నుంచి కొందరు మంత్రులను తప్పించనున్నట్లు తెలిపారు. మంత్రి పదవులు కోల్పోయినంత మాత్రాన వారిని పక్కన పెట్టినట్లు కాదని పేర్కొన్నారు. మంత్రి వర్గంలో లేనివారు పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుందని వారికి జిల్లా ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. మంత్రి పదవులు కోల్పోయినంత మాత్రాన నిరాశ చెందవద్దని, మళ్లీ గెలిచొస్తే మీరే మంత్రులు అవుతారని జగన్ పేర్కొన్నారు. మంత్రివర్గంలో స్థానం కోసం చాలా మంది పోటీలో ఉన్నారని అన్నారు. సీఎం చేసిన ఈ వ్యాఖ్యలతో కేబినెట్ విస్తరణ అంశంపై జోరుగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా మంత్రివర్గంలో తమకు చోటు ఉంటుందా, ఉండదా అని పలువురు మంత్రులు ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఏ అంశాల ప్రాతిపదికన జగన్ మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేయబోతున్నారన్నది ప్రాధాన్యతను సంతరించుకుంది. 2019లో సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పుడే మంత్రివర్గ విస్తరణపై జగన్ క్లారిటీ ఇచ్చారు. రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో 90 శాతం మార్పులు చేర్పులు ఉంటాయని వెల్లడించారు. సీఎం చేసిన ప్రకటనను బట్టి గతేడాదే మంత్రివర్గ విస్తరణ జరగాల్సి ఉన్నా అనివార్య కారణాలతో అది వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు త్వరలో మంత్రివర్గ విస్తరణ చేపట్టనున్నట్లు జగన్ స్పష్టం చేయడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు మొదలుపెడుతున్నట్లు తెలుస్తోంది.ఈ నెల 15న జరిగే వైసీపీ శాసనసభాపక్ష సమావేశంలో మంత్రివర్గ విస్తరణపై మరింత క్లారిటీ రావొచ్చునని చెబుతున్నారు. ఏడుగురు మంత్రులను మినహాయించి మిగతా మంత్రివర్గాన్ని మార్చే అవకాశం ఉందంటున్నారు.
త్వరలో ఆంధ్రప్రదేశ్ మంత్రి వర్గ విస్తరణ
March 11, 2022
0
Tags