ఐక్యం కావాల్సిన సమయం ఆసన్నమైంది

Telugu Lo Computer
0


ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల అనంతరం బీజేపీ వ్యతిరేక కూటమికి బ్రేక్ పడిందని ప్రచారం జరిగింది. అలాంటిదేమి లేదనిమమత సంకేతాలు పంపారు. తాజాగా దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలు, బీజేపీయేతర ముఖ్యమంత్రులు కలిసి కట్టుగా రావాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ సమావేశమై బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుదామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బీజేపీయేతర ముఖ్యమంత్రులకు, వివిధ రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల నేతలకు లేఖలు రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీని ఎదుర్కొనేందుకు చేతులు కలపాలని లేఖలో ప్రస్తావించారు. ప్రతి పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలను బీజేపీ దుర్వినియోగం చేస్తోందని ఆరోపించిన మమత కేంద్ర సంస్థలను బీజేపీ రాజకీయాలకు వాడుకొంటోందని దుయ్యబట్టారు. ప్రతిపక్షాలను తొక్కేసేందుకు సెంట్రల్ ఏజెన్సీలను సైతం ఉపయోగించుకోంటోందన్నారు. ఈ పరిస్థితి మారాలంటే బీజేపీయేతర పక్షాలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం వచ్చిందని, ఆ దిశగా బీజేపీయేతర పక్షాలు సమావేశం నిర్వహించాలని సూచించారు. ప్రతిపక్షాల ఐక్యతే దేశాన్ని కాపాడుతుందనే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంపై బీజేపీ దాడికి పాల్పడుతోందని, ప్రత్యక్ష దాడులకు దిగుతోందని లేఖలో తెలిపారు. ప్రభుత్వ దర్యాప్తు సంస్థలను రాజకీయాలకు వినియోగిస్తోందని, ఎన్నికల ముందు రాజకీయ ప్రత్యర్థులపైన దాడి చేసే విధంగా ఉయోగించుకోంటోందన్నారు. ఈ సమయంలో ఐక్యం కావాల్సిన సమయం అని, సానుకూల సమయాన్ని..స్థలాన్ని సూచిస్తే.. ఓసారి సమావేశం అవుదామని లేఖలో ప్రస్తావించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలి ? రాజకీయ పార్టీలపై కక్ష సాధింపు చర్యలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలి ? 2024 సార్వత్రిక ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి ? అనే దానిపై చర్చించే అవకాశం ఉంది.మరో రెండు నెలల్లో రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్షాల మద్దతు లేకుండా ఈ ఎన్నికలు చేయలేరని మమత ఇప్పటికే కౌంటర్ ఇచ్చారు. సమాఖ్య వ్యవస్థకు నెలకొల్పాలని, సమర్థవంతమైన ప్రతిపక్షంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తాజాగా సీఎం మమత వెల్లడించారు. త్వరలోనే వీరంతా భేటీ అవుతారని, ఈ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)