1300 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

Telugu Lo Computer
0


ముడి చమురుపై మరింత కఠినంగా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లన్నీ మూమెంటమ్‌ కోల్పోయాయి. దాంతో ఇండియన్‌ మార్కెట్లు నష్టాల్లో ముగిశాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 709 పాయింట్ల మేర నష్టపోగా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 16,700 దిగువ స్థాయిల్లో ముగిసింది. క్రితం సెషన్లో 56,486 వద్ద ముగిసిన బీఎస్‌ఈ సెన్సెక్స్‌ నేడు 56,663 వద్ద స్వల్ప లాభాల్లోనే మొదలైంది. ఇదే క్రమంలో కొనుగోళ్లు పెరగడంతో 56,720 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే మధ్యాహ్నం ఒక్కసారిగా విక్రయాలు పెరగడంతో 55,418 వద్ద సూచీ ఇంట్రాడే కనిష్ఠానికి పతనమైంది. గరిష్ఠంతో పోలిస్తే 1300 పాయింట్లు నష్టపోయింది. ఆఖర్లో కాస్త తేరుకొని 709 పాయింట్ల నష్టంతో 55,776 వద్ద ముగిసింది. సోమవారం 16,871 వద్ద ముగిసిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ మంగళవారం 16,900 వద్ద మొదలైంది. అట్నుంచి 16,927 వద్ద ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకింది. అయితే అమ్మకాల సెగతో 16,555 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి చేరుకుంది. 370 పాయింట్ల మేర పతనమైంది. చివర్లో కాస్త పుంజుకొని 208 పాయింట్ల నష్టంతో 16,663 వద్ద ముగిసింది. నిఫ్టీ బ్యాంకు 35,467 వద్ద ఆరంభమైంది. 35,643 వద్ద ఇంట్రాడే గరిష్ఠానికి చేరుకుంది. మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా పతనమై 34,706 వద్ద ఇంట్రాడే కనిష్ఠాన్ని తాకింది. చివరికి 289 పాయింట్ల నష్టంతో 35,022 వద్ద ముగిసింది. నిఫ్టీలో 14 కంపెనీల షేర్లు లాభపడగా 36 నష్టపోయాయి. టాటా కన్జూమర్స్‌, ఎం అండ్‌ ఎం, సిప్లా, శ్రీసెమ్‌, మారుతీ స్వల్పగా లాభపడ్డాయి. టాటా స్టీల్‌, హిందాల్కో, ఓఎన్‌జీసీ, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ 4-5 శాతం వరకు నష్టపోయాయి. ఆటోను మినహాయిస్తే మిగతా అన్ని సూచీలు ఎరుపు రంగులోనే ముగిశాయి. ఐటీ, మెటల్‌, పవర్‌, ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ సూచీలు 1-4 శాతం మేర పతనమయ్యాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)