రవితేజ సమర్పణలో 'ఎఫ్​.ఐ.ఆర్'​

Telugu Lo Computer
0


'రాక్షసన్​' సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు విష్ణు విశాల్​ చేస్తున్న కొత్త సినిమా 'ఎఫ్​.ఐ.ఆర్'​. దానికి ఆయనే నిర్మాత. ఈ సినిమాను తెలుగులో  రవితేజ సమర్పిస్తున్నారు. రవితేజ నటిస్తున్న 'ఖిలాడి'కి పోటీగా ఈ సినిమా కూడా ఫిబ్రవరి 11నే విడుదల కానుండటం విశేషం. ఈ సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు విష్ణు విశాల్. "ప్రేక్షకులు కరోనా తర్వాత ఓటీటీలో ప్రపంచ సినిమా మొత్తాన్ని చూసి మరింత చురుగ్గా ఆలోచించడం మొదలు పెట్టారు. వాళ్లకి ఇప్పుడు వినోదం పంచాలంటే సినిమాలో ఏదో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉండాల్సిందే. అందుకు తగ్గట్టే మా సినిమా రూపొందింది" అన్నారు కథానాయకుడు విష్ణు విశాల్‌. తమిళంలో వరుస విజయాలు అందుకుంటున్న కథానాయకుడీయన. బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి గుత్తా జ్వాలని వివాహం చేసుకుని తెలుగింటి అల్లుడు అయ్యారు. విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తూ, స్వీయ నిర్మాణంలో రూపొందించిన చిత్రం 'ఎఫ్‌.ఐ.ఆర్‌'. మను ఆనంద్‌ దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.  ఈ సందర్భంగా విష్ణు విశాల్‌ శనివారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. "తెలుగు ప్రేక్షకులు అటు వాణిజ్య, ఇటు కంటెంట్‌ ప్రధానమైన చిత్రాలు రెండింటినీ ఆదరిస్తుంటారు. అందుకే నా భార్య జ్వాల 'రాక్షసన్‌' చూశాక 'చాలా బాగుంది, నువ్వు దీన్ని తెలుగులో విడుదల చేయాల్సిందే' అని పట్టుబట్టింది. కుదరలేదు. ఆ తర్వాత అది 'రాక్షసుడు'గా తెలుగులో రీమేక్‌ అయ్యి విజయవంతమైంది. 'ఎఫ్‌.ఐ.ఆర్‌' సినిమాని చూశాక మళ్లీ జ్వాల చెప్పింది. ఎలా విడుదల చేయాలా? అని ఆలోచిస్తున్నప్పుడు నా భార్య స్నేహితురాలు శ్వేత, రవితేజ దగ్గర పని చేస్తుంటారు. ఆమెతో మాట్లాడాక రవితేజ దగ్గరికి వెళ్లా. నేను ఆయన సినిమాలు చూశాను కానీ, వ్యక్తిగతంగా కలవడం అదే తొలిసారి. కానీ ఎప్పట్నుంచో పరిచయం ఉన్న వ్యక్తిలా నాతో మాట్లాడారు. మీలా నేను మాస్‌ హీరో కావాలని అనుకుంటున్నానని నేనంటే, ఆయన నీలాంటి కథలతో సినిమాలు చేయాలనుకుంటున్నా అన్నారు. అలా మా మధ్య సరదా సంభాషణ సాగింది. ఆ తర్వాత మా ప్రాజెక్ట్‌ గురించి చెప్పి, సినిమా చూపించాం. ఆయనకు నచ్చి దీన్ని సమర్పించేందుకు ముందుకొచ్చారు. ఇదే నెలలోనే ఆయన నటించిన 'ఖిలాడి' విడుదలవుతున్నా, 'ఏం పర్వాలేదు, నేను నటించిన సినిమా అది, ఇది సమర్పిస్తున్న సినిమా. పోస్టర్‌పై నా పేరు వేయండి' అంటూ భుజం తట్టారు. ఆ తర్వాత అభిషేక్‌ పిక్చర్స్‌ సంస్థ ఈ సినిమా చూసి విడుదల చేయడానికి ముందుకొచ్చింది. ఇప్పటివరకు నా కెరీర్‌లోనే అత్యధిక వ్యాపారం చేసిన సినిమా ఇదే. తప్పకుండా ప్రేక్షకుల్నీ మెప్పిస్తుంది". "నేను ఈ సినిమాలో ఇర్ఫాన్‌ అహ్మద్‌ అనే యువకుడి పాత్రలో కనిపిస్తా. ఆ పాత్ర విషయంలో నాకు నా స్నేహితుడు సయ్యద్‌ మహమ్మద్‌ స్ఫూర్తి. మా ఇద్దరి మధ్య మతం ప్రస్తావన ఎప్పుడూ వచ్చేది కాదు. సమాజంలో మతం ముసుగులో జరిగే సంఘటనలు చాలా బాధని కలిగించేవి. ఈ స్క్రిప్ట్‌ విన్నప్పుడు కూడా నేనూ, సయ్యద్‌ కలిసి క్రికెట్‌ ఆడుతున్నప్పుడు ప్రయాణాల్లో జరిగిన కొన్ని సంఘటనలు గుర్తుకొచ్చాయి. అలాగని ఈ సినిమాతో ఏ మతానికీ ఇది తప్పు, ఇది ఒప్పు అని చెప్పం. మతం కంటే మానవత్వం, సమానత్వమే గొప్పదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. గౌతమ్‌ మేనన్‌ దగ్గర పదేళ్లకిపైగా పనిచేసిన అనుభవం ఉన్న దర్శకుడు మను. సున్నితమైన ఈ కథని ఒప్పుకోవడం వల్ల తనూ ఆశ్చర్యపోయాడు. దర్శకుడు గౌతమ్‌ మేనన్‌తో కలిసి ఈ సినిమాలో నటించడం, నా నిర్మాణంలో ఆయన చేయడం ఎప్పటికీ ప్రత్యేకమే". "నాకు రీమేక్‌ సినిమాలంటే అంతగా నచ్చవు. నేను క్రికెటర్‌ని కావడం వల్లే 'జెర్సీ' రీమేక్‌లో నటిస్తున్నా. అంతే తప్ప, మిగతా సినిమాల పరంగా కొత్త కథలకే నా ప్రాధాన్యం. నా కెరీర్‌లో 'రాక్షసన్‌' కంటే ముందు చాలా విజయాలే ఉన్నాయి. 'రాక్షసన్‌' నా మార్కెట్‌ని మరింతగా పెంచింది. 'రాక్షసన్‌' తర్వాత చాలా పెద్ద నిర్మాణ సంస్థలు, పేరున్న దర్శకులతో తొమ్మిది సినిమాలు ఖరారయ్యాయి. అవన్నీ సెట్స్‌పైకి వెళ్లకుండానే ఆగిపోయాయి. ఇలా జరగకూడదని నా నిర్మాణంలోనే 'ఎఫ్‌.ఐ.ఆర్‌' చేశా". అని అన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)