రైల్వే ప్రయాణికులకు కొత్త నిబంధనలు !
January 23, 2022
0
రైల్వే ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు రైల్వే శాఖ కొత్త నిబంధనలు రూపొందించింది. ఇకపై రైళ్లలో భారీ సౌండ్తో మ్యూజిక్ ప్లే చేయడం, సెల్ఫోన్లలో బిగ్గరగా మాట్లాడటంపై నిషేధం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఈ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవు. ప్రయాణికుల నుంచి అందిన ఫిర్యాదుల నేపథ్యంలో రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. రాత్రి 10 గంటల తర్వాత రైలు కోచ్లో నైట్ లైట్ మినహా అన్ని లైట్లు ఆఫ్ చేయాల్సిందే. అర్ధరాత్రి వరకు ముచ్చట్లు పెడుతూ కూర్చుంటామంటే కుదరదు. లైట్స్ ఆఫ్ చేసిన వెంటనే ఎవరి సీట్లో వారు నిద్ర పోవాల్సిందే. కొత్త నిబంధనలను ప్రయాణికులు పాటిస్తున్నారో లేదో పర్యవేక్షించే బాధ్యతను ఆర్పీఎఫ్, టీసీ, కోచ్ అటెండెంట్స్, కేటరింగ్, ఇతర సిబ్బందికి రైల్వే శాఖ అప్పగించింది. ఒకవేళ ఎవరైనా ప్రయాణికులకు అసౌకర్యం కలిగితే దానికి వీరిదే బాధ్యత ఉంటుంది. తాజా నిబంధనలను పశ్చిమ రైల్వేకి చెందిన అధికారి ఒకరు దృవీకరించారు. ప్రస్తుతం ఈ నిబంధనల అమలుకు సంబంధించి రెండు వారాల స్పెషల్ డ్రైవ్ కూడా చేపట్టినట్లు తెలిపారు. స్పెషల్ డ్రైవ్లో భాగంగా టీసీ, ఇతర సిబ్బంది కొత్త నిబంధనలపై ప్రయాణికులకు అవగాహన కల్పించనున్నారు. మ్యూజిక్ వినేవారు తప్పనిసరిగా ఇయర్ ఫోన్స్ ఉపయోగించాలని ప్రయాణికులకు చెప్పనున్నారు.
Tags