హత్యకు దారితీసిన వివాహేతర సంబంధం

Telugu Lo Computer
0


తమిళనాడులోని తిర్పూర్ జిల్లా తారాపురం సమీపంలోని కవుంతక్కి ప్రాంతంలో 46 ఏళ్ల మహిళ గుర్తుతెలియని మృతదేహం కనిపించడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. సోమవారం ఉదయం నగ్న స్థితిలో పడి ఉన్న ఆ మృతదేహాన్ని చూసి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తారాపురం పోలీసులు స్పాట్‌కు చేరుకుని పరిశీలించారు. ఈ దర్యాప్తులో సదరు మహిళ దారుణంగా హత్యకు గురైందని తేలింది. ఆమె మృతదేహాన్ని పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆమెను ఎవరు చంపారో, ఎందుకు చంపారో విచారణ చేసిన పోలీసులకు కీలక విషయాలు తెలిశాయి. హత్యకు గురైన ఆ మహిళను లారీ ఓనర్ ప్రకాష్ (50) భార్య సుజాత (46)గా పోలీసులు గుర్తించారు. తిర్పూర్‌లోని తిరుమురుగన్ పూండీ ప్రాంతంలో ఈ భార్యాభర్తలు నివాసం ఉండేవారు. సుజాత హత్య కేసు విచారణలో భాగంగా ఆమె కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. చివరిగా ఆమె ఎవరితో మాట్లాడిందో ఆరా తీయగా తారాపురం సమీపంలోని శకునిపాలయం ప్రాంతానికి చెందిన వేలుసామి (65)తో మాట్లాడినట్లు తెలిసింది. పోలీసులు ఆ 65 ఏళ్ల వృద్ధుడిని అదుపులోకి తీసుకుని విచారించగా సుజాతను తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అయితే సుజాతను చంపడానికి వేలుసామి చెప్పిన కారణం విని షాకవడం పోలీసుల వంతైంది. తారాపురంలోని ఓ మిల్లులో వేలుసామి పనిచేస్తున్నాడు. 15 ఏళ్ల క్రితం అతని భార్య చనిపోయింది. కూతురికి పెళ్లి చేసి పంపించేశాడు. అప్పటి నుంచి ఒంటరిగా ఉంటున్నాడు. ఈ క్రమంలోనే సుజాతతో ఫోన్‌లో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగింది. ఈ చనువు వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఇద్దరూ తరచుగా కలుస్తుండేవారు. సుజాతకు అడిగినప్పుడల్లా వేలుసామి డబ్బులు ఇస్తూ ఉండేవాడు. అయితే.. సుజాత ఈ మధ్య తరచుగా డబ్బులు అడుగుతుండటంతో వేలుసామి ఇబ్బందిపడ్డాడు. ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలయ్యాయి. గత 20 రోజులుగా సుజాత డబ్బు డిమాండ్ చేస్తూ వేలుసామిపై ఒత్తిడి తెచ్చింది. డబ్బులివ్వకపోతే మన వివాహేతర సంబంధం గురించి అందరికీ చెబుతానని బెదిరించింది. ఇన్నాళ్లూ గుట్టుగా సాగించిన వ్యవహారం బయటపడితే పరువు పోతుందని భయపడిన వేలుసామి ఆమెను చంపేందుకు ప్లాన్ చేశాడు. డిసెంబర్ 19న ఆమెకు ఫోన్ చేసి తారాపురం రావాలని కోరాడు. అతని మాట ప్రకారం వచ్చిన ఆమె వేలుసామిని డబ్బు డిమాండ్ చేయడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో ఆమెపై కోపంతో క్షణికావేశంలో వేలుసామి సుజాత గొంతుపిసికి చంపాడు. ఆమెను వివస్త్రను చేసి ఆమె ధరించిన దుస్తులను కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత అక్కడ నుంచి పారిపోయాడు. విచారణలో వేలుసామి నేరం అంగీకరించడంతో పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. సుజాత హత్య స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివాహేతర సంబంధాలు ఎంతటి అనర్థదాయకమో మరోసారి రుజువు చేసిన ఘటన ఇది.

Post a Comment

0Comments

Post a Comment (0)