జర్మనీలోని సోలింగెన్ ప్రాంతానికి చెందిన 28ఏళ్ల క్రిస్టియానె.కె గతేడాది సెప్టెంబర్లో తన ఆరుగురు బిడ్డల్లో ఐదుగురిని దారుణంగా హత్య చేసింది. వారిలో ఒక సంవత్సరం, రెండు, మూడు ఏళ్ల వయసున్న ముగ్గురు కుమార్తెలుండగా.. ఆరు, ఎనిమిదేళ్ల వయసున్న ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిని హత్య చేసి మృతదేహాలను వస్త్రంలో చుట్టి బెడ్పై పెట్టింది. మరో కుమారుడు హత్య జరిగే సమయంలో పాఠశాలలో ఉండటంతో ప్రాణాలు దక్కాయి. అనంతరం తాను ఆత్మహత్య చేసుకోవాలని భావించిన క్రిస్టియానె రైలు కిందపడబోయింది. అయితే, స్థానికులు ఆమెను కాపాడి పోలీసులకు అప్పగించడంతో ఈ ఘోరం బయటపడింది. పిల్లల్ని చంపే ముందు వారికి మత్తుమందు కలిపిన అల్పాహారం ఇచ్చిందని, ఆ తర్వాత హత్య చేసిందని కోర్టులో న్యాయవాదులు వాదన వినిపించారు. ఆమెకు దూరమైన భర్త.. మరో మహిళతో కలిసి ఉన్న ఫొటో చూసి ఆవేశానికి గురైందని.. ఆ కోపంలోనే పిల్లల్ని హత్య చేసిందని తెలిపారు. మరోవైపు తాను నిర్దోషినని.. ఇంట్లోకి ఓ దుండగుడు ముసుగు వేసుకొని వచ్చి ఈ హత్యలు చేశాడని క్రిస్టియానె తెలిపింది. కానీ, విచారణలో ఆమె చెప్పినవి అబద్ధమని తేలడంతో కోర్టు ఆమెకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది.
కన్నబిడ్డల్ని చంపిన తల్లికి జీవితఖైదు!
November 05, 2021
0