స్టాక్ మార్కెట్ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్మార్కెట్ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్గా గుర్తింపు పొందింది. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్టెక్ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్క్యాప్ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది. ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్లో మల్టీబ్యాగర్ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్టెక్ నిలిచింది. కొత్తగా షేర్ మార్కెట్లోకి వచ్చిన వారికి స్టాక్ మార్కెట్లో లాభాల రుచిని చూపించింది.
స్టాక్ మార్కెట్లో తెలుగు కంపెనీ సత్తా
November 09, 2021
0