డా. సర్వేపల్లి రాధాకృష్ణన్

Telugu Lo Computer
0


డా. సర్వేపల్లి రాధాకృష్ణన్  భారతదేశపు మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతి. భారతీయ తాత్వికచింతనలో పాశ్చాత్య తత్వాన్ని ప్రవేశ పెట్టారని ప్రతీతి. రెండు పర్యాయాలు ఉపరాష్ట్రపతి పదవి చేపట్టి, తరువాత రాష్ట్రపతిగా ఒక పర్యాయం పదవిని చేపట్టి, భారతదేశపు అత్యంత క్లిష్టకాలంలో (చైనా, పాకిస్తాన్లతో యుద్ధ సమయం) ప్రధానులకు మార్గనిర్దేశం చేశారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ 5- 1888న మద్రాసుకు ఈశాన్యంగా 64 కి.మీల దూరమున ఉన్న తిరుత్తణిలో తమిళనాడుకు వలస వెళ్లిన తెలుగుదంపతులు అయినా సర్వేపల్లి వీరస్వామి, సీతమ్మ దంపతులకు జన్మించారు. వీరాస్వామి ఒక జమీందారీలో తహసిల్దార్. వారి మాతృభాష తెలుగు. సర్వేపల్లి బాల్యము, విద్యాభ్యాసము ఎక్కువగా తిరుత్తణి, తిరుపతిలోనే గడిచిపోయాయి. ప్రాథమిక విద్య తిరుత్తణిలో సాగింది. తిరుపతి, నెల్లూరు, మద్రాసు క్రిస్టియన్ కాలేజీ మున్నగుచోట్ల చదివి ఎం.ఏ పట్టా పొందారు.బాల్యం నుండి అసాధారణమైన తెలివితేటలు కలవాడాయాన. 1906లో 18 సంవత్సరాల చిరుప్రాయంలో శివకామమ్మతో వివాహము జరిగింది. వీరికి ఐదుగురు కూతుళ్ళు, ఒక కుమారుడు కలిగారు. 21 సంవత్సరాలైనా దాటని వయసులో అతను మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో ప్రొఫెసర్ అయ్యారు. తత్వశాస్త్రంలో అతని ప్రతిభను విని మైసూరు విశ్వవిద్యాలయం ఉపకులపతి హెచ్.వి.నంజుండయ్య అతనిని పిలిపించి ప్రొఫెసర్ గా నియమించారు. అతను ఉపన్యాసాలను ఎంతో శ్రద్ధగా వినేవారు విద్యార్థులు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్య పదవి చేపట్టమని, డా. అశుతోష్ ముఖర్జీ, రవీంద్రనాథ టాగూర్‌లు కోరారు. దాంతో అతను కలకత్తా వెళ్ళారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడుగా వున్నప్పుడు అతను 'భారతీయ తత్వశాస్త్రం' అన్న గ్రంథం వ్రాశారు. ఆ గ్రంథం విదేశీ పండితుల ప్రశంసలందుకున్నది.

1931లో డా. సి.ఆర్.రెడ్డి గారి తర్వాత రాధాకృష్ణన్ గారు ఆంధ్రవిశ్వవిద్యాలయం వైస్ ఛాన్సిలర్‌గా పనిచేశారు. అప్పట్లో డా. రాధాకృష్ణన్‌గారి పిలుపుననుసరించి ప్రొఫెసర్ హిరేన్ ముఖర్జీ, హుమయూన్ కబీర్ వంటి మేధావులు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్లుగా పనిచేశారు.

1931లోనే రాధాకృష్ణన్ "లీగ్ ఆఫ్ నేషన్స్ 'ఇంటలెక్చ్యుయల్ కో-ఆపరేషన్ కమిటి'" సభ్యులుగా ఎన్నుకోబడినారు. 1936లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రాచ్యమతాల గౌరవాధ్యపకులయ్యారు. చైనా, అమెరికా దేశాల్లో పర్యటించి పెక్కు ప్రసంగాలు చేశారు.

1946లో ఏర్పడిన భారత రాజ్యాంగ పరిషత్ సభ్యులయ్యారు. 1947 ఆగస్టు 14-15తేదీన మధ్యరాత్రి 'స్వాతంత్ర్యోదయం' సందర్భాన శ్రీ రాధాకృష్ణన్ చేసిన ప్రసంగం సభ్యులను ఎంతో ఉత్తేజపరిచింది.

1949లో భారతదేశంలో ఉన్నత విద్యాసంస్కరణలు ప్రవేశపెట్టాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఒక కమిటి నియమించింది. దానికి అధ్యక్షుడు డా. రాధాకృష్ణన్. డా.రాధాకృష్ణన్, ప్రధాని నెహ్రూ కోరిక మేరకు 1952-62 వరకు భారత ఉపరాష్ట్రపతిగా పనిచేశారు.

పాశ్చాత్య తత్వవేత్తలు ఎలా తమ భావనలను తమ సంస్కృతిలో అప్పటికే ఉన్న వేదాంత ప్రభావానికి ఎలా లోనవుతున్నారో చూపించారు. అతని దృష్టిలో తత్వము అనేది జీవితాన్ని అర్ధంచేసుకోవటానికి ఒక మార్గము, భారతీయ తత్వమును అర్ధం చేసుకోవటం అనేది ఒక సాంస్కృతిక చికిత్సగా భావించేవారు. భారతీయ ఆలోచనా దృక్పధాన్ని పాశ్చాత్య పరిభాషలో చెప్పి, అందులో వివేకము, తర్కము ఇమిడి ఉన్నాయని చూపించి, భారతీయ తాత్వికచింతన ఏమాత్రం తక్కువ కాదని నిరూపించారు.  మూర్తీభూత సమగ్ర భారతీయ సంస్కృతి  మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో తాత్విక శాస్త్ర ఉపన్యాసకుడిగా, ఉపప్రాధ్యాపకుడుగా, ప్రాధ్యాపకుడిగా వివిధ పదవులను అలంకరించారు. 1918 నుండి 1921 వరకు మైసూరు విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ప్రాధ్యాపకుడిగా (ప్రొఫెసర్) పనిచేసారు. 1921లో, అప్పటి భారతదేశంలోని కలకత్తా విశ్వవిద్యాలయంలో ముఖ్య తాత్విక పీఠమైన, కింగ్ జార్జ్ 5 చెయిర్ ఆఫ్ మెంటల్ అండ్ మోరల్ సైన్స్ కు రాధాకృష్ణన్‌ను నియమించారు.

1926 జూన్‌లో బ్రిటనులో జరిగిన విశ్వవిద్యాలయాల కాంగ్రేసులో కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు. తరువాత ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డు విశ్వవిద్యాలయం నిర్వహించే అంతర్జాతీయ తాత్విక కాంగ్రేసులో సెప్టెంబర్ 1926లో కూడా కలకత్తా విశ్వవిద్యాలయానికి ప్రాతినిధ్యం వహించారు.

1929లో ఆక్స్‌ఫర్డులోని మాంచెస్టరు కళాశాలకు ప్రిన్సిపాలుగా పనిచేయుటకు అతనును ఆహ్వానించారు. దీనివలన ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలోని విద్యార్థులకు "తులనాత్మక మతము" (Comparative Religion) అనే విషయం మీద ఉపన్యాసము ఇవ్వగలిగే అవకాశము వచ్చింది.

1931 నుండి 1936 వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు. 1936లో, స్పాల్డింగ్ ఫ్రొఫెసర్ ఆఫ్ ఈస్ట్రన్ రిలీజియన్స్ అండ్ ఎథిక్స్ అనే పీఠంలో ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయంలో  1952లో భారతదేశ ఉపరాష్ట్రపతి పదవిని అలంకరించే వరకు కొనసాగారు. 1939 నుండి 1948 వరకు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయానికి ఉపకులపతి (వైస్ ఛాన్సలర్)గా పనిచేసారు.

1949 నుండి 1952 వరకు రష్యాలో భారత రాయబారిగా పనిచేసారు. 1946 నుండి 1950 వరకు పలుమార్లు భారతదేశం తరుపున యునెస్కో సభ్య బృందానికి అధ్యక్షత వహించారు.

1948లో విశ్వవిద్యాలయాల విద్యా కమిషనుకు అధ్యక్షుడిగా భారత ప్రభుత్వంచే నియమింపబడ్డారు. 1948లో యునెస్కో కార్యనిర్వాహక బృందానికి అధ్యక్షుడిగా ఉన్నారు. 1952లో యునెస్కో అధ్యక్షునిగా ఎంపికయ్యారు. 1962లో బ్రిటీషు ఎకాడమీకి గౌరవసభ్యునిగా ఎన్నుకోబడ్డారు. 

ఉపాధ్యాయ వృత్తికి అతను తెచ్చిన గుర్తింపు, గౌరవమునకుగాను ప్రతీ సంవత్సరం అతను పుట్టిన రోజైన సెప్టెంబర్ 5ను ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటారు. 1931లో బ్రిటీషు ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్ఠాత్మక సర్ బిరుదు ఇతనును వరించింది. 1954లో మానవ సమాజానికి అతను చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారతరత్న బిరుదు పొందారు. 1961లో జర్మనీ పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానం (Peace Prize of the German Book Trade) పొందారు.

1963 జూన్ 12న బకింగ్‌హామ్ ప్యాలెస్‌లోని ఆర్డర్ ఆఫ్ మెరిట్‌కి గౌరవ సభ్యునిగా ఎన్నుకోబడ్డారు. ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలయిన ఆక్స్‌ఫర్డు, కేంబ్రిడ్జి, మొదలయినవాటి నుండి వందకు పైగా గౌరవ పురస్కారాలు, డాక్టరేటులు సంపాదించారు. ఆక్స్‌ఫర్డు విశ్వవిద్యాలయము సర్వేపల్లి రాధాకృష్ణన్ సంస్మరణార్ధం రాధాకృష్ణన్ చెవెనింగ్ స్కాలర్‌షిప్ను ప్రకటించింది. రాధాకృష్ణన్ ది చాలాపేద కుటుంబం. ఉన్నత విద్య చదివించే స్తోమత లేదని తండ్రి వీరాస్వామి కొడుకును పూజారిగా చేయమన్నారు. కానీ రాధాకృష్ణన్‌కు చదువంటే ప్రాణం. అందుకే ఉన్నత పాఠశాల చదువుకోసం తిరుపతిలోని మిషనరీ పాఠశాలలో చేరారు. ఇక అప్పటినుంచీ ఇతను చదువంతా ఉపకారవేతనాలతోనే సాగిపోయింది. భోజనం చేసేందుకు అరిటాకు కూడా కొనలేని పరిస్థితుల్లో అతను నేలను శుభ్రపరచుకొని భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.

మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో తత్వశాస్త్రంలో ఎమ్మే పూర్తిచేసిన రాధాకృష్ణన్ ఇరవై ఏళ్ల వయసులోనే మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజీలో బోధకుడిగా చేరారు. అతను పాఠం చెప్పే తీరు విద్యార్థుల్లో ఎంతో ఆసక్తి కలిగించేది. అతను రోజులో 12 గంటలపాటు పుస్తకాలు చదువుతూనే ఉండేవారు. ఎన్నో విలువైన వ్యాసాలు, పరిశోధన పత్రాలను రాసేవారు. రాధాకృష్ణన్ మైసూర్ విశ్వవిద్యాలయం, కోల్‌కతా విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్ పదవులు చేపట్టడమే కాదు, ఆంధ్రా యూనివర్సిటీ, బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాల్లో ఉపకులపతి (వైస్‌ఛాన్స్‌లర్) గా పనిచేశారు. రష్యాలో భారత రాయబారిగా కూడా పనిచేశారు. అతను రాసిన 'ఇండియన్ ఫిలాసఫీ' పుస్తకం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేక ఆహ్వానంపై ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించారు. 'యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్'లో సభ్యుడిగా ఉండి మన విద్యా వ్యవస్థ అభివృద్ధికి ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు రాధాకృష్ణన్. 1952లో మన మొదటి ఉపరాష్ట్రపతిగా, 1962లో భారత రెండో రాష్ట్రపతిగా అత్యున్నత పదవులు చేపట్టారు. 1954లో భారతరత్న పురస్కారం దక్కింది. అయినా ఏనాడూ ఆడంబరాలకు పోలేదు. రాష్ట్రపతిగా ఉన్నప్పుడు వచ్చే వేతనంలో కేవలం 25 శాతం తీసుకుని మిగతాది ప్రధాన మంత్రి సహాయ నిధికి తిరిగిచ్చేవారు. రాధాకృష్ణన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పుడు విద్యార్థులకు శ్రద్ధగా బోధించడమే కాదు, వారిపై ప్రేమాభిమానాలు చూపేవారు. అతను మైసూరు నుంచి కలకత్తాకు ప్రొఫెసర్‌గా వెళ్లేప్పుడు గుర్రపు బండిని పూలతో అలంకరించి తమ గురువును కూర్చోబెట్టి రైల్వేస్టేషన్ వరకు విద్యార్థులే లాక్కుంటూ వెళ్లారట. రాధాకృష్ణన్ రాష్ట్రపతిగా ఉన్నప్పుడు అతను శిష్యులు, అభిమానులు పుట్టినరోజును ఘనంగా చేస్తామని కోరగా, దానికి బదులు ఆ రోజును ఉపాధ్యాయ దినోత్సవంగా చేయాలని అతను కోరారట. ఆరోజు నుంచే అతను పుట్టినరోజును ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.

Post a Comment

0Comments

Post a Comment (0)