మెర్కల్ పార్టీకి ఎదురుదెబ్బ..!
September 27, 2021
0
జర్మనీలో జరుగుతున్న జాతీయ ఎన్నికల్లో ఏంజెలా మెర్కల్ ప్రాతినిధ్యం వహిస్తున్న సీడీయూ (క్రిస్టియన్ డెమొక్రటిక్ యూనియన్)కు గట్టి ఎదురు దెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ సర్వేలు అంచనా వేస్తున్నాయి. వీరి ప్రత్యర్థి అయిన సోషల్ డెమొక్రటిక్ పార్టీ స్వల్ప ఆధిక్యం దక్కించుకుంటుందని చెబుతున్నాయి. మెర్కెల్ త్వరలో పదవి నుంచి వైదొలగనుండటంతో ఆమె స్థానంలో రానున్న అర్మెన్ లాస్చెట్కు ఇది గట్టి ఎదురు దెబ్బ. ఈ ఎన్నికల ఫలితాలు వెలువడాల్సి ఉంది. ఈ సందర్భంగా ఎస్డీయూ పార్టీ నాయకుడు ఓలఫ్ స్కాల్జ్ మాట్లాడుతూ పాలించడానికి తమ పార్టీకి అన్ని సర్వేల్లో తగినంత మెజార్టీ వచ్చిందన్నారు. ''ఇది ఒక మంచి సందేశం.. స్పష్టమైన ఆధిపత్యం మంచిది.. మేం జర్మనీలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం'' అని చెప్పారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీని పాలించిన నాలుగో ఎస్డీయూ నాయకుడిగా స్కాల్జ్ నిలిచారు. సర్వేల్లో 2005 తర్వాత ఎస్డీయూకు ఈ స్థాయి మెజార్టీ వచ్చింది. దీంతో 16ఏళ్లపాటు సాగిన మెర్కల్ పాలన ముగియనుంది. సర్వే అంచనాల్లో ఎస్డీయూకు 26.0శాతం ఓట్లు రాగా.. మెర్కల్ నేతృత్వంలోని సీడీయూ పార్టీకి 24.5శాతం ఓట్లు రావచ్చని తేల్చాయి. ఇప్పటికే ఇరు పక్షాలు సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటకు పావులు కదుపుతున్నాయి. ఇప్పుడు ది గ్రీన్స్, ది లిబరల్, ఎఫ్డీపీ పార్టీలు కీలకంగా మారనున్నాయి.