ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు అలర్ట్

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వం సమూల మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే..! ఇప్పటికే స్కూళ్లను వివిధ గ్రేడ్లుగా విభజించిన విద్యాశాఖ.. ఇప్పుడు విద్యార్థుల హాజరుపై దృష్టిపెట్టింది. విద్యార్థుల హాజరుశాతాన్ని పెంచడమే లక్ష్యంగా కొత్త విధానాన్ని అమలు చేయబోతోంది. ఇందులో గ్రామ, వార్డు వాలంటీర్లను భాగస్వామ్యం చేయనుంది. అలాగే స్టూడెంట్ అటెండెన్స్ యాప్ ను అందుబాటులోకి తీసుకురానుంది. విద్యార్ధి క్షేమ సమాచారాలు తెలుసుకోవడంతో పాటు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. విద్యార్థులు మూడు రోజులు పాఠశాలకు గైర్హాజరైతే వలంటీర్ ద్వారా విచారణ చేస్తారు. విద్యార్థి ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి సమాచారమందిస్తారు. విద్యార్థులను పర్యవేక్షించే బాధ్యతను ప్రధానోపాధ్యాయులతో పాటు వలంటీర్లకు కూడా అప్పగించింది. ఇందుకోసం రోజూ విద్యార్థి హాజరును నమోదు చేసేందుకు దేశంలో ఎక్కడా లేని విధంగా 'స్టూడెంట్ అటెండెన్స్ యాప్'ను ప్రవేశపెట్టింది. ఈ యాప్ లో విద్యార్థి హాజరును రోజూ నమోదు చేస్తారు. ప్రతిరోజ ఉదయం 11 గంటలకు అన్ని పాఠశాలల్లోని విద్యార్థుల అటెండెన్స్ వివరాలు డీఈఓ కార్యాలయానికి చేరతాయి. ఏ విద్యార్థి అయినా వరుసగా మూడు రోజులు పాఠశాలకు వెళ్లకపోతే విద్యార్థి ఉంటున్న ప్రాంతంలోని వలంటీరుకు సమాచారం వెళ్తుంది. సదరు వాలంటీర్ విద్యార్థి ఇంటికి వెళ్లి ఆరా తీస్తారు. ఒకవేళ అనారోగ్యంతో బాధపడుతుంటే వెంటనే సమీపంలోని ఆస్పత్రికి సమాచారం ఇస్తారు. ఇతరత్రా కారణాలతో పాఠశాలకు గైర్హాజరైతే తల్లిదండ్రులకు సమాచారం చేరవేస్తారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల హాజరు నమోదుపైనే ప్రభుత్వం దృష్టి సారించేది. ఈ విద్యాసంవత్సరం నుంచి ప్రైవేట్ పాఠశాలల నిర్వాహకులు కూడా విద్యార్థుల హాజరును 'స్టూడెంట్ అటెండెన్స్ యాప్'లో తప్పనిసరిగా నమోదు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అమ్మఒడి, విద్యాకానుక, విద్యాదీవెన వంటి పథకాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా అమ్మఒడి పథకం రావాలంటే 70శాతం హాజరు తప్పనిసరి స్పష్టం చేసిన నేపథ్యంలో ఈ యాప్ లో పొందుపరిచే సమాచారం కీలకం కానుంది.

ఈనెల 16 నుంచి ఏపీలో కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమైన సంగతి తెలిసిందే. 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థులందరూ తప్పనిసరిగా స్కూలుకు రావాల్సిందేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశాల్లో పేర్కొంది. ఐతే రాష్ట్రవ్యాప్తంగా పలు స్కూళ్లలో విద్యార్థులు, టీచర్లు కరోనా బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు ఐదు కంటే ఎక్కువ కేసులు నమోదైన పాఠశాలలను మూసివేయలాలని ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే స్కూళ్లలో కరోనా టెస్టులు చేసేందుకు ప్రత్యేక బృందాలను సిద్ధం చేసినట్లు వెల్లడించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)