డిజిటల్ మీడియాను శాసించేందుకు కేంద్రం యత్నం
July 10, 2021
0
సోషల్ మీడియా మాధ్యమాలను పర్యవేక్షించే పేరుతో ప్రస్తుతం ప్రధాన స్రవంతి మీడియా కంటే విస్తృ తంగా వ్యాప్తిచెందుతున్న డిజిటల్ మీడియాను శాసించేందుకు నరేంద్ర మోడీ ప్రభుత్వం యత్నిస్తోందని ది హిందూ గ్రూప్ డైరెక్టర్, మాజీ చీఫ్ ఎడిటర్ ఎన్.రామ్ విమర్శించారు. 'ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో భావ ప్రకటనాస్వేచ్ఛ ప్రమాదంలో ఉందా?' అనే అంశంపై ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసికి చెందిన జర్నలిస్టు స్టీఫెన్ సక్కూర్ నిర్వహించిన హార్డ్టాక్ కార్యక్రమంలో రామ్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ఐటి నిబంధనలు సమస్యాత్మకంగా ఉన్నాయన్నారు. నకిలీ వార్తలను ప్రభుత్వం అతిశయోక్తి చేసి చూపుతోందని, ఇటువంటి వార్తల వల్ల ఇప్పటి వరకు భారత్కు ఎటువంటి నష్టం జరగలేదని అన్నారు. తప్పుడు సమాచారం వ్యాప్తి చెందిన సందర్భాలు ఉండొచ్చు, కానీ దాన్ని పరిష్కరించేందుకు ఇప్పటికే చట్టాలు ఉన్నాయని రామ్ పేర్కొన్నారు. డిజిటల్ మీడియాపై కొత్త ఐటి నిబంధనలు అస్పష్టంగా ఉన్నాయన్నారు. చాలా వార్తాపత్రికలు డిజిటల్ రూపం కలిగివున్నాయని, పెద్ద మొత్తంలో ప్రింట్ మెటీరియల్ డిజిటల్ రూపం పొందిందని, ఈ నేపథ్యంలో ఒకే కంటెంట్ కోసం రెండు సెట్ల నియమాలు ఉంటాయా? అని ప్రశ్నించారు.