పీసపాటి నరసింహమూర్తి

Telugu Lo Computer
0


పీసపాటి నరసింహమూర్తి పేరుపొందిన రంగస్థల నటులు. తెలుగు నాటక రంగంపై శ్రీకృష్ణుడు పాత్రదారిగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించుకున్న నటులు. పద్యగానంలో తనకంటూ ఒక ఒరవడిని సృష్టించుకున్న నటులు.

పీసపాటి నరసింహమూర్తి, విజయనగరం జిల్లా బలిజిపేట మండలం, వంతరాం గ్రామంలో 1920, జూలై 10న జన్మించారు. ప్రారంభంలో ఆకాశవాణిలో పనిచేశారు.
1938లో రంగూన్‌రౌడీ నాటకంలో కృష్ణమూర్తి పాత్ర ద్వారా పీసపాటి నాటకరంగంలోకి అడుగుపెట్టారు. 1946లో పాండవోద్యోగ విజయాలు నాటకంలో మొదటిసారిగా శ్రీకృష్ణుడి పాత్ర వేశారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈయనికి రెండు పర్యాయాలు సంగీత నాటక అకాడమీలో సభ్యత్వం ఇచ్చి గౌరవించింది. ఆంధ్ర విశ్వవిద్యాలయం 1993లో ఆయనను కళాప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది. దాదాపు ఏడు దశాబ్దాలపాటు వేలాది ప్రదర్శనలు ఇచ్చిన పీసపాటి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు. తిరుపతి వేంకటకవులు, విశ్వనాథ సత్యనారాయణ వంటివారు అభినందించారు. పాండవోద్యోగ విజయాలతో పాటు గౌతమబుద్ధ, లవకుశ, తారా శశాంకం, చింతామణి లాంటి నాటకాలు అనేకం ఆడినా పీసపాటికి ఎనలేని కీర్తి కృష్ణుని పాత్ర వల్లే వచ్చింది. అత్యుత్తమ కృష్ణునిగా ఉద్యోగవిజయాల నాటక రచయితల్లో ఒకరైన చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి నుంచి అవార్డు అందుకోవడం, టంగుటూరి ప్రకాశం నటరాజు విగ్రహాన్ని బహుమతిగా ఇవ్వటం, బిలాస్‌పూర్ లో  తెలుగురాని ఒక బెంగాలీ జంట నాటకం చూసి, గ్రీన్‌ రూమ్‌లో ఇతనిని తనివితీరా ముద్దాడడం తన జీవితంలో మరపురాని సంఘటనలుగా పీసపాటి పేర్కొన్నారు. పద్యగానంలో పీసపాటి అనేక మార్పులు తీసుకువచ్చారు. తెలుగు పౌరాణికాల్లో పద్యాలను సుదీర్ఘమైన రాగాలతో పాడడం అలవాటుగా ఉండేది. ఒక నిముషం పద్యానికి ఐదేసి నిముషాల రాగం తియ్యడం ఆనవాయితీగా ఉండేది. పీసపాటి ఆ పద్ధతిని విడనాడి, అనవసరమైన సాగతీతలను విసర్జించి, సాహిత్యానికి ఎక్కువ విలువ కల్పిస్తూ పద్యం పాడి ప్రజలను అలరించారు. పీసపాటి కృష్ణుడి వేషధారణలో కూడా మార్పులు తీసుకువచ్చారు. దేహానికి అంటిపెట్టుకుని ఉండే నీలపు రంగు చొక్కా ధరించి నిజంగా నీలపు కృష్ణుడేననే భ్రమ కల్పించారు. పీసపాటి 1987-1993 కాలంలో బొబ్బిలి మండలం, రాముడువలస గ్రామానికి సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాచిరాజు కృష్ణ మూర్తి ఈయన సమకాలీన సాహితీవేత్త. పీసపాటి నరసింహమూర్తి 2007, సెప్టెంబర్ 28న మరణించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)