అనంత పద్మనాభ స్వామి ఆలయం

Telugu Lo Computer
0


విష్ణుమూర్తిని వివిధ రూపాలలో స్తుతిస్తూ 12 మంది ఆళ్వారులూ తమ రచనలైన పాశురాలలో ప్రస్తుతించిన క్షేత్రాలను " వైష్ణవ దివ్యదేశాలు " అని అంటారు..

ఇవి 108. మన హిందువులు అతి పవిత్రంగా  భావించే ఈ క్షేత్రాలలో ప్రముఖమైనది తిరువనంతపురంలోని  అనంత పద్మనాభ స్వామి ఆలయం. కేరళ రాష్ట్రంలో ఉన్న ఈ ఆలయంలో విష్ణుమూర్తి నాభియందు పద్మంతో  అనంతుడనే సర్పంపై నిద్రించిన శయనరూప భంగిమలో దర్శనమిస్తాడు మనకి. పురాణకాలం నుండి ప్రసిద్ధమైన ఈ ఆలయఅన్ని క్రీ.శ 1568 లో ట్రావెన్ కూర్ సంస్థాన సంస్థాపకుడైన మార్తాండ వర్మ తిరిగి పునర్నిర్మించారు. 7 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ ఆలయం కేరళ మరియు ద్రావిడ నిర్మాణ శైలి యొక్క మేలు కలయికతో నిర్మించబడింది. వంద అడుగుల ఎత్తు కలిగిన తూర్పు రాజ ద్వారంలలోని ఏడు అంతస్థులలో పూర్తిగా విష్ణు పురాణ గాధలను తెలిపే శిల్పాలతో నిండి ఉంటుంది.. ఈ ఆలయంలోని గర్భాలయాన్ని చుట్టివున్న శ్రీ బలి పుర మండపం 365 స్తంభాల మీద నిర్మించబడినది. ఒక్కో స్థంభానికి ఒక్కో దీప కన్య ఆనుకుని స్వాగతం చెప్తున్నట్లుగా చెక్కారు .  వీరి చేతిలోని ప్రమిదలలో నూనె  పోస్తే  నాలుగు గంటల దాక దీపం వెలుగుతుంటుంది.. ఈ దీపపు కన్యల ఏ రెండు శిల్పాలూ ఒకేలా ఉండకపోవడం ఇక్కడో విశేషం. అది దాటి లోపలకి వెళ్తే ఎడమవైపున ఇరవై ఎనిమిది స్తంభాల మీద నిర్మించబడిన "కులశేఖర మండపం" అద్భుత శిల్పాలతో నిండి ఉంటుంది.. ఏక శిల మీద చెక్కిన ఒక గుత్తిలాగా , ఒకే స్తంభం లాగా ఉండే సన్నని స్తంభాలను తట్టితే సప్త స్వరాలను పలుకుతాయి అవి. అది దాటి ముందరకు వెళ్తే " ఒట్టుక్కాల్ మండపం " పైనుండి మూడు ద్వారాల ద్వారా అనంతపద్మనాభ స్వామి యొక్క దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవచ్చు. ఈ ఆలయంలోని గర్భగుడిలోని మూల విరాట్ ను 1208 సాలగ్రామాలతో తయారు చేసారు. తమిళనాడులోని శ్రీరంగంలోని రంగనాధుడు , కుంభకోణంలోని సారంగపాణి దేవాలయాలలోని మూలవిరాట్ విగ్రహాలు కూడా ఇదే తరహా ఉన్నా వాటిన్నిటికన్నా ఈ ఆలయంలోని విగ్రహం చాలా పెద్దది. అనంత శేషుడు తన శరీరాన్ని మూడుచుట్లుగా చుట్టి, తన అయిదు శిరస్సులను ఛత్రంగా చేసిన పాన్పు మీద శ్రీ పద్మనాభుడు అనంతశయనునిగా దర్శనమిస్తాడు ఇక్కడ. జీవుల యొక్క జననం , స్థితి , మరణం అనే మూడు ప్రముఖ దశలకూ సంకేతంగా చెప్పబడే ఆ మూడు ద్వారాలలో మొదటి ద్వారం గుండా తన సుందర ముఖారవిందాన్ని,  చేతిలో శివలింగాన్ని , మధ్య ద్వారం ద్వారా నాభి కమలంలో ఉపస్థితుడైన విధాతను , ఉత్సవ మూర్తులను, ఆఖరి ద్వారం నుండి బ్రహ్మ కడిగిన శ్రీవారి దివ్య పాదపద్మాలను భక్తులకు కన్నుల పండుగగా ఉంటుంది.  నిజంగా ఈ స్వామి యొక్క ఆ దివ్య మంగళరూప దర్శనం ఓ గొప్ప అనుభవం. ఐహిక, లౌకిక భావనలను మైమరపించేంత గొప్ప అనుభూతి కలుగుతుంది ఆ స్వామి దర్శనం వల్ల అంచేతనేనేమో అనేకమంది రాజులు కొన్ని లక్షల విలువైన బంగారు ఆభరణాలను , విలువైన వజ్రాలనూ ఇంకా అనేకానేక విలువైన వస్తువులనూ సమర్పించారు.  ఆ అపార సంపదంతా గర్భాలయం వెనుకున్న మండపంలోని కొన్ని గదులలో ఉంది. ఈ ఆలయంలో భద్రత చాలా కట్టుదిట్టంగా ఉంది. ఇక్కడ సాంప్రదాయలను చాలా నిక్కచ్చిగా పాటిస్తారు. పురుషులు పంచె కండువా , స్త్రీలు సాంప్రదాయ దుస్తులతో మాత్రమే దర్శనానికి వెళ్ళాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)