నెల్లూరు జిల్లాలో ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వర్తిస్తున్న జయమ్మ గత నెలలో కరోనా బారినపడి కోలుకున్నారు. అనంతరం బ్లాక్ ఫంగస్ సోకడంతో తిరుపతిలోని స్విమ్స్లో చేరారు. ఆస్పత్రి మెడిసిన్ వార్డులో బ్లాక్ ఫంగస్కు చికిత్స పొందుతున్న జయమ్మ శనివారం బాత్రూమ్లో ఉరేసుకున్నట్టు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారని ఆర్డీఓ కనక నర్సారెడ్డి తెలిపారు.ఆమె జయమ్మ కుటుంబసభ్యులతో ఈ సందర్భంగా మాట్లాడారు. ఆత్మహత్య ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదే ఆస్పత్రిలో ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా కలికిరికి చెందిన ఓ యువకుడు మృతిచెందాడు. సరైన వైద్యం అందకే యువకుడు మృతిచెందాడంటూ అతడి తరఫు బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళనకు దిగారు. పేషెంట్లకు లోపలికి ఏదైనా పంపించాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే వాదనలు వినిపించారు. తమ వారిని చూడ్డానికి కూడా లోపలికి పంపించలేదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారికి సర్ది చెప్పారు.