దేశంలోనే అత్యంత సంపన్నమైన వ్యక్తిగా రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మరోసారి అగ్రస్థానంలో నిలిచారు. ఆసియాలో నంబర్ 1 స్థానం కూడా ఆయనదే. ప్రపంచ కుబేరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నారు. గతేడాది 83 బిలియన్ డాలర్లుగా ఉన్న ఆయన సంపద.. ఏడాదిలో భారీగా పెరిగి 116 బిలియన్ డాలర్లకు చేరిందని ఫోర్బ్స్ పేర్కొంది. ఆసియాలో 100 బిలియన్ క్లబ్లోకి చేరిన తొలి కుబేరుడుగా ముకేశ్ నిలిచారని తెలిపింది. ఈమేరకు ఫోర్బ్స్ 2024కు సంబంధించి బిలియనీర్ల జాబితాను ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే ఈసారి భారత్లో బిలియనీర్ల సంఖ్య భారీగా పెరిగిందని ఫోర్బ్స్ వెల్లడించింది. గతేడాది 169గా ఉన్న ఈ సంఖ్య 200కు పెరిగినట్లు తెలిపింది. బిలియనీర్ల మొత్తం సంపద సైతం 675 బిలియన్ డాలర్ల నుంచి 41 శాతం వృద్ధితో 954 బిలియన్ డాలర్లకు పెరిగిందని పేర్కొంది. దేశీయ జాబితాలో అదానీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ గౌతమ్ అదానీ 84 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానంలో నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో 17వ స్థానంలో ఉన్నారు. 33.5 బిలియన్ డాలర్లతో దేశంలో నాలుగో స్థానంలో ఉన్న సావిత్రి జిందాల్.. సంపన్న మహిళల జాబితాలో తొలిస్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ జాబితాలోకి 25 మంది కొత్తగా చోటు దక్కించుకోగా, బైజూ రవీంద్రన్, రోహికా మిస్త్రీ వంటి వారు తమ స్థానాలను కోల్పోయారు.
భారత సంపన్నుల్లో అగ్రగామి ముకేశ్ అంబానీ !
April 03, 2024
0
Tags