ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తనకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తూ పిటిషన్ ను కొట్టేసింది. చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్నందున ఈ నెల 16 వరకూ మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఏప్రిల్ 4న తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా, బెయిల్ పిటిషన్ కొట్టేస్తున్నట్లు తీర్పు ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై వాదనల సందర్భంగా ఈడీ ఆమెకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరింది. ఆమె కుమారుడికి ఇప్పటికే 7 పరీక్షలు పూర్తయ్యాయని.. కవితకు బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని తెలిపింది. ఆమె రాజకీయంగా పలుకుబడి గల వ్యక్తి అని.. మధ్యంతర బెయిల్ ఇస్తే సాక్ష్యాలు, ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉందని పేర్కొంది. ఇప్పటికే అప్రూవర్ గా మారిన కొందరిని ఆమె బెదిరించారని, అందుకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తెచ్చింది. మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టేయాలని ఈడీ కోరింది. ఈడీ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం మధ్యంతర బెయిల్ పిటిషన్ తోసిపుచ్చుతూ ఉత్తర్వులు ఇచ్చింది.
కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ కొట్టివేత
April 08, 2024
0
Tags