ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లా చింతలపూడి వైసీపీఎమ్మెల్యే ఎలిజా ఆదివారం వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సమక్షంలో ఆయన హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు పార్టీ కండువా కప్పి షర్మిల కాంగ్రెస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. కాగా, చింతలపూడిలో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన్ను కాదని.. కంభం విజయరాజుకు వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. దీంతో తీవ్ర అసంతృప్తికి గురైన ఆయన హస్తం గూటికి చేరినట్లు తెలుస్తోంది. వైసీపీలో అవమానాలు ఎదుర్కొన్నానని ఎమ్మెల్యే ఎలిజా తెలిపారు. 'చింతలపూడి నియోజకవర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేకపోయా. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నాకు తెలియకుండా కార్యక్రమాలు చేశారు. శిలా ఫలకాల మీద నా పేర్లు కూడా తీసేశారు. అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినా ఉపయోగం లేదు. నా పార్టీ అనుకొని పని చేస్తే మోసం చేశారు. ఈ దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ చాలా అవసరం. కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ. కాంగ్రెస్ ఒక్కటే ఏ మతానికి, కులానికి బేస్ కాదు. పార్టీలో కష్టపడి పని చేస్తా. కచ్చితంగా కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తుంది. వైసీపీలో ఉన్న అసమ్మతి నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉండొచ్చు. నన్ను బయటకు పంపిన వైసీపీ నేతలు ఎవరో అందరికీ తెలుసు.' అని పేర్కొన్నారు.
కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా !
March 24, 2024
0
Tags