సీబీఐ కస్టడీకి షాజహాన్‌ షేక్‌ ?

Telugu Lo Computer
0


శ్చిమ బెంగాల్‌లోని సందేశ్‌ఖాలీలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారులపై దాడి కేసులో ప్రధాన నిందితుడైన షాజహాన్‌ షేక్‌ను పోలీసులు ఎట్టకేలకు సీబీఐకి అప్పగించారు. బుధవారం సాయంత్రం 4.15గంటల కల్లా ఎట్టి పరిస్థితుల్లో అతడిని, కేసు వివరాలను కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కి అప్పగించాల్సిందేనంటూ కలకత్తా హైకోర్టు డెడ్‌లైన్‌ విధించిన నేపథ్యంలో తాజా పరిణామం చోటుచేసుకుంది. దీంతో రెండు రోజులుగా బెంగాల్‌ ప్రభుత్వం, కేంద్ర ఏజెన్సీల మధ్య కొనసాగిన హైడ్రామాకు తెరపడినట్లయింది. సందేశ్‌ఖాలీలో దోపిడీ, భూకబ్జాలు, లైంగిక వేధింపుల కేసుల్లో షాజహాన్‌ షేక్‌ కీలక నిందితుడిగా ఉన్న విషయం తెలిసిందే. సందేశ్‌ఖాలీ కేసుకు సంబంధించిన దర్యాప్తు బాధ్యతలను కలకత్తా హైకోర్టు మంగళవారమే సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే, దీనిపై పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానం తలుపు తట్టింది. తాము తక్షణమే దీనిపై విచారణ జరపలేమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఈ పరిణామాల నేపథ్యంలో సీబీఐ బాధ్యతలు తీసుకొని మంగళవారం సాయంత్రానికే కేసు నమోదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారుల బృందం.. కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా అక్కడ నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నందున షాజహాన్‌ షేక్‌ను అప్పగించేందుకు బెంగాల్‌ పోలీసులు నిరాకరించారు. దీంతో మంగళవారం దాదాపు రెండు గంటల పాటు వేచి చూసిన సీబీఐ బృందం అక్కడినుంచి ఖాళీ చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది. బుధవారం సీబీఐ మరోసారి కలకత్తా హైకోర్టును ఆశ్రయించి పోలీసుల తీరును వివరించడంతో పాటు సీఐడీపై కోర్టు ధిక్కార కేసు నమోదు చేయాలని కోరింది. సుప్రీంకోర్టు దీనిపై ఎలాంటి స్టే విధించకపోవడంతో బెంగాల్‌ పోలీసుల తీరును తప్పుబట్టిన హైకోర్టు.. ఈ సాయంత్రం 4.15 గంటల కల్లా నిందితుడిని సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం షాజహాన్‌ షేక్‌తో పాటు కేసుకు సంబంధించిన వివరాలన్నింటినీ బెంగాల్‌ పోలీసులు సీబీఐకి అప్పగించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)