మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించిన ప్రజా ప్రతినిధుల బృందం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన మేడిగడ్డ బ్యారేజీని మంగళవారం సాయంత్రం ప్రజా ప్రతినిధుల బృందం పరిశీలించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావుతోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఎంఐఎం ప్రజాప్రతినిధులు ప్రాజెక్టు దెబ్బతిన్న ప్రాంతాన్ని పరిశీలించారు. బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు ఈ పర్యటనకు దూరంగా ఉన్నారు. మంగళవారం ఉదయం అసెంబ్లీ నుంచి బస్సుల్లో బయలుదేరిన ప్రజాప్రతినిధులు సాయంత్రం 3 గంటలకు మేడిగడ్డ చేరుకున్నారు. ప్రధానంగా బ్యారేజీలో దెబ్బతిన్న ఏడో బ్లాక్ లోని పియర్స్‌ను పరిశీలించారు. అధికారులు ప్రాజెక్టు పరిస్థితిపై సీఎం రేవంత్, మంత్రులకు వివరించారు. అంతకుముందు రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ ట్విట్టర్ వేదికగా గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. 'తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి... 97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ప్రాజెక్టు డిజైన్ నుంచి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదు' అని సీఎం రేవంత్ మండిపడ్డారు. 'మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదు... పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన.కేసీఆర్ తో పాటు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించాం. బీఆర్ఎస్ తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదు' అని రేవంత్ వ్యాఖ్యానించారు. 'కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు... వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఒకటిగా ఒకవైపు ఉన్నాయి. మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోంది' అని రేవంత్ చెప్పుకొచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)