పంజాబ్లోని జలంధర్ నగర శివారులోని ఓ కాలువ పక్కన అర్జున అవార్డు గ్రహీత, పంజాబ్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ) దల్బీర్ సింగ్ దేఓల్ (54) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం జలంధర్లోని పంజాబ్ సాయుధ పోలీసు ప్రధాన కార్యాలయంలో దల్బీర్ సింగ్ను ప్రభుత్వం నియమించింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా స్నేహితులతో కలిసి ఆయన ఆదివారం సాయంత్రం బయటకు వెళ్లారు. ఇంటి నుంచి వెళ్లి ఎన్ని గంటలైనా తిరిగి రాలేదు. దీంతో ఆయన కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అధికారిని గుర్తించేందుకు పోలీసులు గాలింపులు చేపట్టారు. నగర శివారులో ఓ కాలువ పక్కన శరీరమంతా గాయాలతో ఓ వ్యక్తి మృతదేహం కనిపించిందని పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఆ మృతదేహం దల్బీర్ సింగ్దేనని గుర్తించారు. అయితే, ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా.. గతంలో జరిగిన ఆసియా క్రీడల్లో పాల్గొన్న దల్బీర్ వెయిట్ లిఫ్టింగ్లో బంగారు పతకాన్ని గెలిచారు. అందుకు గానూ 2000లో ఆయనను అర్జున అవార్డు వరించింది.
పంజాబ్ డీఎస్పీ అనుమానాస్పద మృతి !
January 01, 2024
0
Tags