అతి పొడవైన సముద్రపు వంతెన ప్రారంభం !

Telugu Lo Computer
0


ముంబైలో నిర్మించిన దేశంలోనే అత్యంత పొడవైన వంతెనను శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. దేశంలో సముద్రంపై నిర్మించిన వంతెనల్లో ఇదే అతి పెద్దది కావడం విశేషం. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవా శేవాను 'ముంబై ట్రాన్స్‌ హార్బర్‌ లింక్' కలుపుతోంది. ఈ అతి పెద్ద వంతెనకు మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి గౌరవార్థం 'అటల్ సేతు' అని పేరు పెట్టారు. ఆరు లైన్లుగా నిర్మించిన ఈ వంతెన వ్యయం రూ.21,200 కోట్లు. వంతెన మొత్తం పొడవు 21.8 కిలోమీటర్లు కాగా, 16 కి.మీలపైగా అరేబియా సముద్రంపైనే ఉంది. ఈ వంతెన కారణంగా ముంబై, నవీ ముంబైల మధ్య ప్రయాణ సమయం ఎంతో ఆదా అవుతుంది. ప్రస్తుతం ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించేందుకు రెండు గంటల కన్నా ఎక్కువ సమయం పడుతుండగా వంతెన వల్ల కేవలం 15 నుంచి 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. ఈ వంతెన నిర్మాణానికి సరికొత్త సాంకేతికతను వినియోగించారు. ఈ వంతెన భూకంపాలను సైతం తట్టుకుంది. 2016 డిసెంబర్‌లో ఈ వంతెనకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వాహనదారుల భద్రత కోసం 400 సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. వాహనదారులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వెంటనే కెమెరాల ద్వారా కమాండ్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందనుంది. బైకులు, ఆటో రిక్షాలు, ట్రాక్టర్లకు ఈ బ్రిడ్జిపైకి వెళ్లేందుకు అనుమతి లేదు. కార్లు, టాక్సీలు, తేలికపాటి మోటారు వాహనాలు, మినీబస్సులను అనుమతిస్తారు. ఈ బ్రిడ్జిపై వాహనాలు గంటలకు 100 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించవచ్చు.


Post a Comment

0Comments

Post a Comment (0)