నిఫ్టీ 50 లోని కొన్ని షేర్లు ఈ ఏడాది ఇన్వెస్టర్లకు బంపర్ లాభాలిచ్చాయి. ఈ బెంచ్మార్క్ ఇండెక్స్ 17 శాతం లాభపడగా, ఐదు పెద్ద షేర్లు మాత్రం 82 శాతం వరకు పెరిగాయి. ఎక్స్చేంజ్ డేటా ప్రకారం, టాటా మోటార్స్ షేర్లు ఈ ఏడాది 82 శాతం రిటర్న్ ఇచ్చాయి. ఈ ఏడాది జనవరిలో రూ.400 దగ్గర ట్రేడయిన కంపెనీ షేర్లు శుక్రవారం రూ.725 దగ్గర క్లోజయ్యాయి. మరింత పెరుగుతాయని బ్రోకరేజ్ కంపెనీ షేర్ఖాన్ అంచనా వేస్తోంది. షేరు టార్గెట్ ధరను రూ.840 గా నిర్ణయించింది. 'టాటా మోటార్స్ షేర్లకు బయ్యింగ్ రేటు కొనసాగిస్తున్నాం.కంపెనీ లగ్జరీ బ్రాండ్ జేఎల్ఆర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని చివరి ఆరు నెలల్లో మంచి పెర్ఫార్మెన్స్ చేస్తుందని భావిస్తున్నాం. కంపెనీ నికర అప్పులు దిగొస్తున్నాయి. టాటా మోటార్స్ డొమెస్టిక్ బిజినెస్ మెరుగుపడుతోంది. ఇబిటా మార్జిన్ (లాభం) పెరుగుతుందని అంచనా వేస్తున్నాం. కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ కూడా పుంజుకుంటోంది. పండుగ సీజన్లో కంపెనీ ప్యాసింజర్ వెహికల్ అమ్మకాలు పెరిగాయి' అని షేర్ఖాన్ ఓ రిపోర్ట్లో పేర్కొంది. టాటా మోటార్స్ వచ్చే నెల నుంచి వెహికల్ రేట్లను 3 శాతం వరకు పెంచుతామని ప్రకటించింది. ఈ నిర్ణయంతో కంపెనీ లాభపడుతుందని షేర్ఖాన్ భావిస్తోంది. టాటా మోటార్స్ క్యాష్ ఫ్లో మెరుగవుతోందని, కంపెనీ నెట్ డెట్ రానున్న క్వార్టర్లలో తగ్గుతుందని భావిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి క్వార్టర్లో రూ.41,700 కోట్లు ఉన్న కంపెనీ నెట్ ఆటోమోటివ్ డెట్ రెండో క్వార్టర్ నాటికి రూ.38,700 కోట్లకు తగ్గిందని వెల్లడించింది. బజాజ్ ఆటో ఈ ఏడాది 73 శాతం పెరిగి రూ.3,616 నుంచి రూ.6,246 కు చేరుకుంది. బజాజ్ ఆటో షేర్లపై బ్రోకరేజ్ కంపెనీ కేఆర్ చోక్సే బుల్లిష్గా ఉంది. ఈ కంపెనీ షేర్లు రూ.7,093 వరకు పెరుగుతాయని వెల్లడించింది. డొమెస్టిక్ మార్కెట్ కోసం 125+ సీసీ సెగ్మెంట్లో బజాజ్ ఆటో ఫోకస్ పెట్టిందని, ఇది మంచి ఫలితాలను ఇస్తోందని కేఆర్ చోక్సే ఓ రిపోర్ట్లో పేర్కొంది. ట్రయంఫ్తో కలిసి బజాజ్ మోటార్స్ ప్రీమియం సెగ్మెంట్లో బైక్ లాంచ్ చేసిన విషయం తెలిసిందే. రానున్న కాలంలో ఈ సెగ్మెంట్లో బజాజ్ ఆటో సేల్స్ పెరుగుతాయని ఈ బ్రోకరేజ్ కంపెనీ అంచనా వేస్తోంది. కంపెనీ ట్రయంఫ్ బైక్ల ప్రొడక్షన్ పెంచుతుందని, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ను మెరుగుపరుస్తుందని పేర్కొంది. మరోవైపు ఎన్టీపీసీ షేర్లు 2023 లో ఇన్వెస్టర్లకు 81 శాతం లాభం ఇచ్చాయి. కిందటేడాది డిసెంబర్ 30 న రూ.161 దగ్గర ట్రేడయిన కంపెనీ షేర్లు ఈ నెల 22 న రూ.303 దగ్గర క్లోజయ్యాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ లార్సెన్ అండ్ టుబ్రో షేర్లు ఈ ఏడాది 64 శాతం పెరిగాయి. కోల్ ఇండియా షేర్లు ఈ ఏడాది 58 శాతం లాభపడ్డాయి. ఎలరా క్యాపిటల్ కోల్ ఇండియా షేర్లకు 'కొనొచ్చు' అనే రేటింగ్ ఇచ్చింది. టార్గెట్ ధరను గతంలో ఇచ్చిన రూ.299 నుంచి రూ.385 కి పెంచింది. కోల్ ఇండియా షేర్లు శుక్రవారం రూ.363 దగ్గర క్లోజయ్యాయి. గత కొన్ని క్వార్టర్లుగా కంపెనీ అమ్మకాలు మెరుగ్గా ఉన్నాయంది. ఏడాదికి షేరుకి రూ.20-23 వరకు డివిడెండ్ ఇస్తుందని అంచనా వేసింది. 'పార్లమెంట్ ఎలక్షన్స్ పూర్తయిన తర్వాత మార్కెట్ నిలకడగా ఉంటుందని అంచనా వేస్తున్నాం. రూలింగ్ పార్టి గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదే జరిగితే మార్కెట్లో చిన్న ర్యాలీ రావొచ్చు. ఆ తర్వాత నుంచి కన్సాలిడేషన్లో మార్కెట్ ఉంటుంది' అని ట్రేడ్జీని సీఓఓ త్రివేష్ డీ వెల్లడించారు. పవర్, రెన్యూవ బుల్ ఎనర్జీ, ఆటోమొబైల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ షేర్లు వచ్చే ఏడాది మంచి రిటర్న్స్ ఇస్తాయని పేర్కొన్నారు.
మంచి లాభాలిచ్చే పెద్ద షేర్లు ?
December 24, 2023
0
Tags