'వికసిత్‌ భారత్‌' స్ఫూర్తిని 2024లోనూ కొనసాగిద్దాం !

Telugu Lo Computer
0


రోజు ప్రసారమైన 2023 చివరి 'మన్‌ కీ బాత్‌'లో భాగంగా ఈ ఏడాది భారత్‌ సాధించిన విజయాలను ప్రధాని నరేంద్ర మోడీ గుర్తు చేశారు. దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ఏడాది దేశం ఎన్నో ఘనతలు సాధించిందని గుర్తు చేశారు. 2023లో దేశ ప్రజల్లో వికసిత్‌ భారత్‌ స్ఫూర్తి రగిలిందని, దాన్ని కొత్త సంవత్సరంలోనూ కొనసాగించాలని పిలుపునిచ్చారు. సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న మహిళా బిల్లుకు ఈ సంవత్సరంలోనే ఆమోదం లభించిందని మోడీ గుర్తుచేశారు. భారత్‌ ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని పేర్కొన్నారు. దీనిపై దేశ ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ లేఖలు రాస్తున్నారని వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక జీ20 సదస్సును విజయవంతంగా నిర్వహించామని తెలిపారు. ప్రస్తుతం భారత్‌లోని ప్రతి ప్రాంతం ఎంతో ఆత్మవిశ్వాసంతో నిండి ఉందని తెలిపారు. దేశ ప్రజల్లో వికాస, స్వయం సమృద్ధి భారత్‌ స్ఫూర్తి రగిలిందని చెప్పారు. 2024లోనూ దాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది 'నాటు నాటు' పాటకు ఆస్కార్‌ అవార్డు దక్కడంతో దేశం మొత్తం ఉర్రూతలూగిందని మోడీ తెలిపారు. 'ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'కు సైతం ప్రతిష్ఠాత్మక అవార్డు రావటంతో భారతీయుల ప్రతిభ వెలుగుచూసిందని వ్యాఖ్యానించారు. 2023లో భారతీయుల సృజనాత్మకతను యావత్‌ ప్రపంచం వీక్షించిందని తెలిపారు. ఈ ఏడాదిలో మన క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చూపారని మోదీ కొనియాడారు. ఆసియా క్రీడల్లో 107, పారా గేమ్స్‌లో 111 పతకాలతో సత్తాచాటారని గుర్తు చేశారు. వన్డే ప్రపంచ కప్‌లో భారత క్రికెట్ జట్టు అందరి మనసులు గెలుచుకుందని ప్రశంసించారు. చంద్రయాన్‌-3 విజయవంతంపై చాలా మంది తనకు సందేశాలు పంపుతున్నారని మోదీ తెలిపారు. శాస్త్రవేత్తల కృషితో ఈ ప్రతిష్ఠాత్మక ప్రయోగం విజయవంతమైందని.. ఇది అందరికీ గర్వకారణమని చెప్పారు. ఈ సందర్భంగా శారీరక, మానసిక ఆరోగ్య ప్రాముఖ్యతను ప్రధాని నొక్కి చెప్పారు. ఆ దిశగా చేపట్టిన 'ఫిట్‌ ఇండియా'లో భాగంగా తీసుకున్న పలు చర్యలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సద్గురు జగ్గీ వాసుదేవ్‌, భారత మహిళల క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌, చెస్‌ దిగ్గజం విశ్వనాథన్‌ ఆనంద్‌, నటుడు అక్షయ్‌ కుమార్‌ తమ ఫిట్‌నెస్‌ రహస్యాలను పంచుకున్నారు. అయోధ్యలో రామ మందిరంపై దేశం మొత్తం ఉత్సుకతతో ఉందని ప్రధాని అన్నారు. ప్రజలు రకరకాలుగా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. గత కొన్ని రోజులుగా శ్రీరాముడు, అయోధ్యపై కొత్త పాటలు, భజనలు, కవితలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. వాటిలో కొన్నింటిని తాను సోషల్ మీడియాలో పంచుకున్నానని వెల్లడించారు. ఈ చరిత్రాత్మక ఘట్టంలో కళాప్రపంచం తనదైన శైలిలో భాగస్వామ్యం అవుతోందని అభిప్రాయపడ్డారు. అలాంటి సృజనాత్మకను సోషల్ మీడియాలో '#శ్రీరామభజన్‌'తో పంచుకోవాలని కోరారు.

Post a Comment

0Comments

Post a Comment (0)