స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య !

Telugu Lo Computer
0


స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శ్రీకాకుళం జిల్లా గార బ్రాంచ్ లో ఖాతాదారులు తాకట్టు పెట్టిన గోల్డ్ వ్యవహారంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటుంది. ఈ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. గత పదిహేను రోజులుగా తమ బాంగారాన్ని విడిపించుకుందామని బ్యాంక్ కి వెళుతోన్న ఖాతాదారులకు బ్యాంక్ సిబ్బంది ఏదో ఒక కారణం చెప్పి బంగారం ఇవ్వకుండా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే బ్యాంక్ లో కొదవ పెట్టిన ఖాతాదారుల బంగారం కొంత మిస్ అయిందని ప్రచారం జరిగింది. ఇది ఖాతాదారులలో అనేక అనుమానాలకు తావివ్వటంతో సోమవారం బ్యాంక్ వద్ద ఆందోళనకు దిగారు. డబ్బులు చెల్లించి వారి లోన్ క్లియర్ చేసి బంగారం ఇచ్చేయాలని, లేదంటే కనీసం తాము కొదవపెట్టిన బంగారాన్నైన తమకు చూపించాలని డిమాండ్ చేశారు. దీంతో బ్యాంక్ శ్రీకాకుళం రీజనల్ మేనేజర్ రాజు కలుగజేసుకొని బ్యాంక్ లో ఉంచిన బంగారం మిస్ అయిందనే ప్రచారం వాస్తవం కాదని గోల్డ్ సేఫ్ గానే ఉందని ఖాతాదారులకు తెలిపారు. బ్యాంక్ లో ఆడిట్ అవ్వటం వల్లే ఇప్పుడు బంగారం ఇవ్వలేకపొతున్నామని డిసెంబర్ 8 నాటికి ఆడిట్ పూర్తి చేసి అనుమానం ఉన్న ఖాతాదారుల ఆభరణాలు చూపించటంతో పాటు డబ్బులు చెల్లించిన వారికి ఆభరణాలు ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. అలా ప్రకటించి రెండు రోజులు గడిచిందో లేదో మంగళవారం  గార బ్రాంచ్ కి చెందిన డిప్యూటీ మేనేజర్ ఉరిటి స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకొని మృతి చెందారు. మంగళవారం రాత్రి పాయిజన్ తాగి ఆత్మ హత్యయత్నం చేసిన స్వప్నప్రియను కుటుంబ సభ్యులు శ్రీకాకుళంలోని హాస్పిటల్ కి తరలించగా పరిస్థితి విషమంగా ఉందని చెప్పటంతో మెరుగైన చికిత్స కోసం ఆమెను మంగళవారం రాత్రి విశాఖలోని కార్పొరేట్ హాస్పిటల్ కు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ బుదవారం ఉదయం మృతి చెందారు. గోల్డ్ లోన్ వ్యవహారంలో గత 15 రోజులుగా గందరగోళం నెలకొని ఉంది. అంతా గోప్యత. బ్యాంకులో అసలు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. డబ్బులు అవసరం వచ్చి బంగారం తాకట్టు పెడదామని బ్యాంక్ కి వచ్చేవారికి నో అంటున్నారు. డబ్బులు చెల్లిస్తాం మా బంగారం మాకు ఇవ్వండి అంటున్న ఖాతాదారులకు ఆడిట్ పేరు చెప్పి నో అంటున్నారు. వాస్తవానికి ప్రతి మూడు నెలలకి ఒకసారి జరిగే బ్యాంక్ ఆడిట్ ను బ్యాంక్ సాధన కార్యకలాపాలకు ఆటంకం కలుగకుండా నిర్వహిస్తారని కానీ ఇక్కడ మాత్రం దానికి విరుద్ధంగా అధికారుల తీరు ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. దీనికి తోడు బుధవారం బ్రాంచ్ డిప్యూటీ మేనేజర్ ఆత్మహత్య చేసుకోవడం కూడా బంగారం మిస్ అయింది అనడానికి బలం చేకూర్చేలాగే ఉంది. కస్టమర్లకు తాకట్టు పెట్టిన సుమారు 60 బ్యాగుల వరకు బంగారు ఆభరణాలు లేనట్ల ప్రచారం సాగుతోంది. వాస్తవానికి బ్యాంకు డిప్యూటీ మేనేజర్ స్వప్న ప్రియ, క్యాష్ ఇన్చార్జ్ సురేష్ లు కలిసి వారి వద్ద నున్న రెండు తాళాలును ఒకే సారి తెరిస్తే స్ట్రాంగ్ రూమ్ లోని ఆభరనాలను బయటకు తీయవచ్చు. అయితే ఇటీవల సురేష్ మూడు రోజులు పాటు శెలవు పెట్టడంతో ఆయన బాధ్యతలను వేరే ఉద్యోగికి అప్పగించగా ఆయన తోటి ఉద్యోగి అన్న నమ్మకంతో స్వప్న ప్రియకు తాళాన్ని అందజేయడంతో బంగారు ఆభరణాలుకు రెక్కలు వచ్చాయన్న వాదన ఉంది. శెలవు తరువాత విధుల్లోకి చేరిన ఉద్యోగి బంగారు ఆభరణాలు వివరాలు తెలుసుకోవడంతో అసలు దొంగతనం బయటపడిందని.. మహిళా ఉద్యోగిని నిలదీయగా.. ఆ వ్యక్తిపై ఇటీవల దాడి కూడా జరిగిందని తెలుస్తోంది.గోల్డ్ మాయం వెనుక బ్యాంకు ఉన్నతాధికారి హస్తం కూడా ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ మద్యన సదరు ఉన్నతాధికారి కొత్త కారు కొనటం ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. అయితే బ్యాంక్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. తమ బంగారు ఆభరణాలు తమకు ఇవ్వాలంటున్న ఖాతాదారులకు బ్యాంకులో ఆడిట్ జరుగుతుందని చెప్పటం కుంటి సాకులని ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. నేరానికి పాల్పడిన అధికారుల నుండి బంగారాన్ని రికవరీ చేయటానికే ఆడిట్ పేరుతో కాలయాపన చేస్తున్నారని ఖాతాదారులు అంటున్నారు. కొంత బంగారాన్ని రికవరీ చేశారని మిగతా బంగారాన్ని స్వంత ఖర్చులకు వాడుకోవటంతో విధిలేక స్వప్న ప్రియ ఆత్మహత్య చేసుకుని ఉంటుందని ఖాతాదారులు గుసగుసలాడుకుంటున్నారు. స్వప్న ప్రియ ఆత్మహత్య విషయం తెలిసి బుదవారం బ్యాంక్ వద్దకు వచ్చి తమ ఆవేదనను వెళ్లగక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగారు. అయితే అథికారులు దీనిపై స్పందించాల్సినుంది. బ్యాంకుకు చెడ్డ పేరు రాకుండా వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాల్సి ఉందని ఆర్ధిక రంగ నిపుణులు అంటున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)