కెనడాలో ఖలిస్థానీ ఉగ్రవాది హత్య అనంతర పరిణామాలతో భారత్-కెనడా మధ్య దౌత్యపరమైన విభేదాలు నెలకొన్నాయి. దౌత్యసిబ్బందిని తగ్గించుకోవాలని భారత్ చేసిన సూచనల ప్రకారం చర్యలు చేపట్టిన కెనడా అనేక మంది సిబ్బందిని వెనక్కి రప్పించుకుంది. దీంతో బెంగళూరు, ముంబయి, చండీగఢ్ నగరాల్లోని కాన్సులేట్లలో అన్ని రకాల వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు కెనడా వెల్లడించింది. ఈ పరిణామాలు కెనడా వెళ్లాలనుకునే భారతీయులపై ఏమేరకు ప్రభావం చూపనుందన్న విషయంపై ఆందోళన వ్యక్తమవుతోంది. దాదాపు 17వేలకు పైగా వీసా దరఖాస్తులపై ఆ ప్రభావం ఉంటుందని అంచనా. భారత్ నుంచి 41 మంది దౌత్య సిబ్బందితోపాటు వారి కుటుంబ సభ్యులు 42 మందిని కెనడా వెనక్కి పిలిపించుకుంది. ప్రస్తుతం 21 మంది కెనడా దౌత్యవేత్తలు మాత్రమే ఢిల్లీ లోని కెనడా హైకమిషన్తోపాటు పలు కాన్సులేట్లలో ఉన్నారు. బెంగళూరు, ముంబయి, చండీగఢ్ నగరాల్లో అన్ని రకాల వ్యక్తిగత సేవలను తాత్కాలికంగా నిలిపివేసింది. ఎవరికైనా కాన్సులర్ సహాయం కావాలంటే దిల్లీలోని కెనడా రాయబార కార్యాలయాన్ని సంప్రదించవచ్చని తెలిపింది. భారత్లో 27 మంది ఇమ్మిగ్రేషన్ సిబ్బంది ఉండగా.. ఆ సంఖ్య ఐదుకు తగ్గించినట్లు కెనడా ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీ అండ్ సిటిజన్షిప్ వెల్లడించింది. విదేశాల నుంచి ఈ కార్యకలాపాలను నిర్వహిస్తున్నప్పటికీ తాజా పరిణామాలతో వీసా జారీ ప్రక్రియ ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని పేర్కొంది.సిబ్బందిని తరలించడం ద్వారా డిసెంబర్ చివరినాటికి 17,500 బ్యాక్లాగ్ దరఖాస్తుల నిర్ణయంపై ప్రభావం చూపనున్నట్లు అంచనా. సిబ్బందిని తగ్గించినప్పటికీ ఇతర దేశాల్లో ఉన్న కెనడా ప్రతినిధులు ఈ వ్యవహారాలు చూస్తారని చెప్పింది.
కెనడా కాన్సులేట్లలో సేవలు నిలిపివేత !
October 20, 2023
0
Tags