కోర్టు అనుమతితో బిడ్డను చంపించాలని అనుకుంటున్నారా?

Telugu Lo Computer
0


26 వారాల తన గర్భాన్ని వైద్యపరంగా విచ్ఛిత్తి చేసుకునేందుకు అనుమతినివ్వాలంటూ ఓ మహిళ చేసిన అభ్యర్థనపై భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు ఉత్తర్వుల ద్వారా బిడ్డను చంపేందుకు పిటిషనర్‌ అనుమతి కోరుతున్నారా? అని సీజేఐ ప్రశ్నించారు. బతికే అవకాశాలు ఎక్కువగా ఉన్న పిండాన్ని తాము చంపలేమని వ్యాఖ్యానించారు. తన గర్భవిచ్ఛిత్తికి అనుమతించాలని కోరుతూ ఇద్దరు పిల్లలున్న ఓ 27 ఏళ్ల వివాహిత ఇటీవల సుప్రీంకోర్టును ఆశ్రయించారు. గత ప్రసవాల తర్వాత నుంచి తాను కుంగుబాటుతో ఇబ్బంది పడుతున్నానని, మానసికంగా, ఆర్థికంగా తాను మూడో బిడ్డను కని పెంచే పరిస్థితుల్లో లేనని ఆమె న్యాయస్థానానికి వివరించారు. ఈ పిటిషన్‌పై తొలుత విచారణ జరిపిన ద్విసభ్య ధర్మాసనం వైద్య పరంగా గర్భవిచ్ఛిత్తి చేసుకునేందుకు అక్టోబరు 9న ఆమెకు అనుమతినిచ్చింది. అయితే, ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం పిటిషన్‌ దాఖలు చేసింది. పిండం బతికే అవకాశాలు ఉన్నాయని ఎయిమ్స్‌ వైద్యులు తాజాగా ఇచ్చిన నివేదికను ప్రస్తావించింది. దీంతో ఈ పిటిషన్‌ ప్రధాన న్యాయమూర్  జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ముందుకు చేరింది. ఈ క్రమంలోనే గర్భవిచ్ఛిత్తి ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేసిన సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం.. దీనిపై గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ''తల్లి హక్కుతో పాటు గర్భస్థ శిశువు హక్కుల మధ్య సమతౌల్యం పాటించాల్సిన అవసరం ఉంది. ఆ పిండం సజీవంగా ఉంది. బతికే అవకాశాలున్నాయి. ఇప్పుడు ఆ పిండం గుండె చప్పుడును ఆపమని మేమే ఎయిమ్స్‌ వైద్యులతో చెప్పాలని మీరు కోరుకుంటున్నారా? ఆ బిడ్డను మేం చంపలేం'' అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ''ఈ పిండాన్ని మోస్తూ 26 వారాలుగా ఎదురుచూశారు. ఇంకొన్ని వారాలు మోయలేరా? అప్పుడైతే ఆరోగ్యకరమైన శిశువు జన్మించే అవకాశం ఉంటుంది'' అని కోర్టు అభిప్రాయపడింది. మరికొన్ని వారాలు బిడ్డను మోసే బాధ్యత గురించి ఆ మహిళతో మాట్లాడాలని కేంద్రం, పిటిషనర్‌ తరఫు న్యాయవాదులకు సూచించింది. అనంతరం తదుపరి విచారణను శుక్రవారం ఉదయానికి వాయిదా వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)