మహారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ ఆదేశాలను కాదనరాదు !

Telugu Lo Computer
0


హారాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ తమ ఆదేశాలను కాదనరాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. మహారాష్ట్ర ప్రస్తుత సిఎం ఏక్‌నాథ్ షిండే, ఆయనకు విధేయులు అయిన ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేల్చడంలో స్పీకర్ జాప్యం పట్ల అత్యున్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో స్పందించింది. స్పీకర్ ఈ అంశాన్ని ఆషామాషీగా తీసుకుంటున్నట్లుంది. ఇది కుదరదు. తాము వెలువరించిన ఆదేశాలను పాటించకుండా ఉండటానికి వీల్లేదు అని శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌తో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. అనర్హత పిటిషన్లపై స్పీకర్ తమ నిర్ణయాన్ని మంగళవారం తెలియచేయాలని, దీనిని బట్టి తాము తరువాతి ఆదేశాలు వెలువరించాల్సి ఉంటుందని ధర్మాసనం తెలిపింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు బి పార్థీవాలా, మనోజ్ మిశ్రా సహ సభ్యులుగా ఉన్నారు. మహారాష్ట్రలో ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విషయం సుప్రీంకోర్టు విచారణలో ఉంది. స్పీకర్ రాహుల్ నార్వేకర్ త్వరితగతిన ఈ అంశంపై నిర్ణయం తీసుకోవాలని రాష్ట్రంలోని ఉద్ధవ్ థాకరే వర్గానికి చెందిన శివసేన, శరద్ పవార్ సారథ్యపు ఎన్‌సిపి దాఖలు చేసిన రెండు పిటిషన్లు ఇప్పుడు న్యాయస్థానం విచారణ దశలో ఉన్నారు. థాకరే వర్గం తరఫున సీనియర్ లాయర్ కపిల్ సిబల్ న్యాయవాదిగా ఉన్నారు. వెంటనే అనర్హత వేటు విషయంపై నిర్ణయాలు తీసుకోవాలని సుప్రీంకోర్టు తెలిపిందని, అయితే గడిచిన జూన్ నుంచి దీనిపై ఎటువంటి స్పందనా లేదని, ఇదేం పద్ధతి అని, ఇదేం తేలికపాటి వ్యవహారం అనుకుంటున్నారా? సరిగ్గా వ్యవహరించేలా స్పీకర్‌కు ఎవరైనా సలహా ఇస్తే బాగుంటుందని ఆయన తరఫున వాదన విన్పిస్తున్న సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు ధర్మాసనం తెలిపింది. తమ ముందుకు వచ్చిన అంశంపై ఇప్పటికీ స్పీకర్ తాను సకాలంలో స్పందిస్తానని చెప్పడం సరికాదు. ఈ విధంగా దీనిని ఎంతకాలం నాన్చుతూ వెళ్లుతారు? దీనిని చివరికి రాష్ట్రంలో వచ్చే ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికల వరకూ సాగదీస్తారా? ఏమనుకుంటున్నారు? అని ప్రధాన న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే వారం స్పీకర్ నుంచి సరైన స్పందన లేకపోతే ఇక తాము ఇతరత్రా చర్యలకు దిగాల్సి ఉంటుందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)