ఛత్తీస్‌గఢ్‌ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం !

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్‌లోని రాయగఢ్ జిల్లా పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ ప్రభుత్వం లేకపోవడంతో ఇక్కడి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, ఛత్తీస్‌గఢ్ ప్రజలకు ఉచిత ఇళ్లు ఇవ్వడానికి కూడా కాంగ్రెస్ అనుమతించలేదని మోడీ అన్నారు. పేదలకు పథకాలు అమలు చేయడంలో కాంగ్రెస్ వెనుకబడి ఉండొచ్చు కానీ  కాంగ్రెస్ ప్రభుత్వం స్కామ్‌లలో చాలా ముందుందని తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణాల రికార్డులన్నీ బద్దలు కొట్టిందని, ఛత్తీస్‌గఢ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఏటీఎంలా పనిచేస్తోందని ఆరోపించారు. చాలా కాలం తర్వాత అధికారంలో అవకాశం వచ్చిందని, వీలయినంత దోచుకున్నామని, ఆ తర్వాత అవకాశం రాకపోవచ్చునని కాంగ్రెస్ నేతలు అంటున్నారని తెలిపారు. ఛత్తీస్‌గఢ్ దేశ అభివృద్ధికి పవర్ హౌస్ లాంటిదని ప్రధాని మోడీ అన్నారు. పవర్ హౌస్‌లు తమ పూర్తి శక్తితో పనిచేసినప్పుడే దేశం ముందుకు సాగే శక్తి వస్తుందని తెలిపారు. ఈ ఆలోచనతో గత 9 ఏళ్లలో ఛత్తీస్‌గఢ్ బహుముఖ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని పేర్కొన్నారు. ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో కేంద్రం ప్రతి రంగంలోనూ పెద్ద పథకాలను పూర్తిచేస్తోందని, కొత్త ప్రాజెక్టులకు పునాది వేస్తోందని చెప్పారు. మరోవైపు రాయ్‌ఘర్ జిల్లా కార్యక్రమంలో.. సుమారు 6350 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టులను దేశానికి అంకితం చేశారు. ఈరోజు ఛత్తీస్‌గఢ్‌కు రూ.6400 కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు కానుకగా లభిస్తున్నాయని మోడీ అన్నారు. మరోవైపు ప్రధాని పర్యటనలో భాగంగా.. సికిల్ సెల్ కౌన్సెలింగ్ కార్డులను పంపిణీ చేశారు. నేడు ప్రపంచం మొత్తం ఆధునిక అభివృద్ధి, పేద సంక్షేమం యొక్క వేగవంతమైన భారతీయ నమూనాను చూస్తోందని.. అభినందిస్తోందని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)