ఆర్థిక కష్టాలతో అసువులుబాసిన అశ్విని !

Telugu Lo Computer
0


నెల్లూరుకు చెందిన అశ్విని 1967 జూలై 14న జన్మించింది. భక్త ధ్రువ మార్కండేయ అనే సినిమాలో బాలనటిగా కనిపించింది. తొలి సినిమాకే అందరి దృష్టిని ఆకర్షించిన ఈమె కొంతకాలానికే హీరోయిన్‌గా మారింది. వెంకటేశ్‌తో కలియుగ పాండవులు, రాజేంద్ర ప్రసాద్‌తో స్టేషన్‌ మాస్టర్‌, నాగార్జునతో అరణ్యకాండ చిత్రాలు చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కలుపుకుని 110కి పైగా చిత్రాలు చేసింది. పెళ్లి చేసి చూడు, ఇంటి దొంగ, చూపులు కలిసిన శుభవేళ, వివాహ భోజనంబు.. ఇలా ఒక్క తెలుగులోనే 40కి పైగా సినిమాలు చేసింది. కెరీర్‌ పీక్స్‌లో ఉండగా ఈమె సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నట్లు అప్పట్లో కథనాలు వెలువడ్డాయి. అయితే కొంతకాలానికే ఆమె భర్త తనను మోసం చేసి విడిచిపెట్టి వెళ్లిపోయాడన్న రూమర్స్‌ కూడా వచ్చాయి. ఒంటరిగా ఉన్న అశ్విని కార్తీక్‌ అనే పిల్లవాడిని దత్తత తీసుకుని పెంచుకుంది. అయితే భర్త చేసిన మోసాన్ని తలుచుకుని అశ్విని ఎంతగానో కుంగిపోయింది. అది ఆమె ఆరోగ్యాన్ని దెబ్బకొట్టింది. గుండె నిండా శోకం నింపుకున్నా పైకి మాత్రం నవ్వుతూ కనిపిస్తూ సినిమాలు చేసుకుంటూ పోయింది. కానీ అటు కెరీర్‌ గ్రాఫ్‌ కూడా పడిపోసాగింది. మొదట సీరియల్స్‌లో నటించడానికి ఇష్టపడని ఆమె తర్వాత వెండితెరపై అవకాశాలు తగ్గిపోవడంతో బుల్లితెరపైనా మెరిసింది. ఒకానొక సమయంలో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించడంతో సినిమాలోనే కాదు, ఏ సినీ ఫంక్షన్‌లోనూ కనిపించలేదు. వంద సినిమాలు చేసిందన్న మాటే కానీ తనకు చెన్నైలో ఒక ఇల్లు మాత్రమే ఉండేదట! చివరి రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో దాన్ని కూడా అమ్మేసి అద్దె ఇంట్లో నివసించిందని సమాచారం. 2012లో ఆమె రీఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఓ సీరియల్‌కు సంతకం కూడా చేసింది. కానీ ఆమె ఆరోగ్యం  సహకరించలేదు. తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని శ్రీరామచంద్ర మెడికల్‌ కాలేజీ ఆసుపత్రిలో చేరింది. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఆమెను బతికించలేకపోయారు. అశ్విని తుదిశ్వాస విడిచింది. ఆమె కోరిక మేరకు తన సొంతూరైన నెల్లూరులో ఆమె అంత్యక్రియలు నిర్వహించారు. అయితే ఆమెను చెన్నై నుంచి నెల్లూరుకు తీసుకువెళ్లడానికి కూడా ఆమె కుటుంబం దగ్గర డబ్బులు లేకపోవడంతో దర్శకుడు పార్తీబన్‌ ఆర్థిక సాయం చేశాడు. తన నటనతో అందరికీ వినోదాన్ని పంచిన ఆమె జీవితం మాత్రం విషాదంగా ముగిసిపోయింది.

Post a Comment

0Comments

Post a Comment (0)