చెన్నైలోని గాంధీనగర్లో నివసించే ఆయేషా బుధవారం ఉదయం పాఠశాలకు వెళ్లింది. సాయంత్రం తన తల్లి, సోదరుడితో కలిసి ఇంటికి తిరిగి వెళ్తుండగా వారి ముందున్న రెండు ఆవుల్లో ఒకటి వెనక్కి తిరిగి బాలికను కొమ్ములతో ఎత్తిపడేసింది. దాంతో ఆమె కిందపడిపోయింది. అనంతరం ఆవు వెనక్కి తగ్గకుండా పలుమార్లు బాలికపై దాడి చేసింది. దాంతో ఏం చేయాలో పాలుపోని తల్లి ఎవరైనా సహాయం చేయాలని కేకలు వేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు రాళ్లు విసిరి ఆ జంతువును నిలువరించే ప్రయత్నం చేశారు. అయినా అది వెనక్కి తగ్గలేదు. పలుమార్లు పొడిచిన తర్వాత పారిపోయింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలికను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. నగరంలో ఆవుల విచ్చలవిడి సంచారంపై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ జె.రాధాకృష్ణన్ గురువారం మాట్లాడారు. ఆవు దాడి ఘటన జరగడం దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. దాడి చేసిన ఆవును పెరంబూరు షెల్టర్కు తరలించామని చెప్పారు. పరిస్థితిని తీవ్రంగా పరిగణించి ప్రతి జోన్లో రోడ్లపై సంచరిస్తున్న ఆవులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి 15 వాహనాలను ఏర్పాటు చేశామని, ఇప్పటిదాకా పలువురు ఆవుల యజమానులకు రూ.51.75 లక్షల జరిమానా విధించినట్లు వెల్లడించారు. కాగా, ఆవు దాడి ఘటనపై అరుంబాక్కం పోలీసులు కేసు నమోదు చేశారు.
బాలికపై ఆవు దాడి !
August 10, 2023
0
Tags