మహారాష్ట్ర డిప్యూటీ సీఎం, ఎన్సీపీ తిరుగుబాటు నేత అజిత్ పవర్, ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ శనివారం రహస్యంగా సమావేశమయ్యారు. పూణె కోరేగావ్ పార్క్ ప్రాంతంలో ఉన్న ఒక వ్యాపారవేత్త నివాసంలో వారిద్దరూ కలుసుకున్నారు. శనివారం మధ్యాహ్నం 1 గంటకు కారులో ఆ ఇంటికి వచ్చిన శరద్ పవార్ సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి తిరిగి వెళ్లారు. అనంతరం సాయంత్రం 6.45 గంటలకు అజిత్ పవార్ మీడియా కంటపడకుండా అక్కడి నుంచి జారుకున్నారు. ఈ నేపథ్యంలో వ్యాపారవేత్త ఇంట్లో రహస్యంగా కలుసుకున్న శరద్ పవార్, అజిత్ పవార్ సుమారు ఐదు గంటలపాటు ఏం మాట్లాడుకున్నారు అన్నదానిపై సస్పెన్స్ నెలకొన్నది. మహారాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరుగుతాయా? అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, ఇదేమీ రహస్య మీటింగ్ కాదని ఎన్సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ మీడియాతో ఆదివారం అన్నారు. అజిత్ పవార్తో కలిసి తాను కూడా అక్కడికి వెళ్లినట్టు తెలిపారు. అయితే తాను త్వరగా అక్కడి నుంచి వెళ్లిపోయానని చెప్పారు. ఈ నేపథ్యంలో శరద్ పవార్, అజిత్ పవార్ మధ్య ఏం సంభాషణ జరిగిందో అన్నది తనకు తెలియదన్నారు. అలాగే ఎన్సీపీ చీలిపోలేదని, తమ అధినేత శరద్ పవార్ అని మరోసారి స్పష్టం చేశారు.
శరద్ పవార్, అజిత్ రహస్య భేటీ ?
August 13, 2023
0
Tags