జాబిల్లికి మరింత దగ్గరగా చంద్రయాన్ 3

Telugu Lo Computer
0


చంద్రయాన్ 3 జాబిల్లికి మరింత దగ్గరగా వెళ్లినట్టు భారత అంతరిక్షపరిశోధన సంస్థ ఇస్రో వెల్లడించింది. ఈ మేరకు వివరాలను ట్వీట్ చేసింది. బుధవారం చంద్రయాన్3 జాబిల్లి ఉపరితలానికి మరింత దగ్గర చేరిందని పేర్కొంది. మరో ప్రదక్షిణను పూర్తి చేసిందని వెల్లడించింది. " చంద్రుడి ఉపరితలానికి మరింత దగ్గరగా చేరుకొన్నాం. బుధవారం విన్యాసంతో చంద్రయాన్ 3 ఆర్బిటర్‌ను 174కిమీx1437 కిమీ తగ్గించాం. తర్వాత ఆపరేషన్ ఆగస్టు 14 వ తేదీన అంతర్జాతీయ కాలమానం ప్రకారం 11.30 నుంచి 12.30 మధ్యలో చేపడతాం" అని పేర్కొంది. ఆ తర్వాత ఆగస్టు 16న చంద్రుడిపై 100 కిమీ ఎత్తున కక్ష లోకి ఈ అంతరిక్ష నౌక చేరనుంది. ఆ మర్నాడే ల్యాండింగ్ మాడ్యూల్ ప్రొపల్సన్ మాడ్యూల్ నుంచి విడిపోతుంది. దీనిలో ల్యాండర్ ( విక్రమ్ ), రోవర్ (ప్రగ్యాన్ ) ఉంటాయి. అంతా సజావుగా సాగితే ఈనెల 23 సాయంత్రం 5.47 గంటలకు ల్యాండర్ రోవర్ చంద్రుడిపై ల్యాండింగ్‌కు ఉపక్రమిస్తుంది. బెంగళూరులో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఇస్రో ఛైర్మన్ ఎస్. సోమనాథ్ మాట్లాడుతూ ఆగస్టు 23న చంద్రయాన్ 3 సురక్షితంగా జాబిల్లిపై దిగేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఈ మొత్తం ప్రాజెక్టులో 30 కిలోమీటర్ల ఎత్తు నుంచి ల్యాండర్ వేగాన్ని తగ్గించడమే అత్యంత కష్టమైన ప్రక్రియ అని ఇస్రో ఛైర్మన్ పేర్కొన్నారు. చంద్రయాన్ 2 లో ఈ దశలో జరిగే ప్రక్రియల్లోనే సమస్యలు తలెత్తాయన్నారు. అత్యధిక ఇంధనం వాడుకోకుండా చూడటంతోపాటు, దూరాన్ని కచ్చితంగా లెక్కించామన్నారు. అంతేకాదు, ల్యాండర్ లోని సెన్సర్లు ఆగస్టు 23న విఫలమైనా, అది సురక్షితంగా చంద్రుడి ఉపరితలం పైకి చేరగలదని ఆయన వెల్లడించారు " అన్ని సెన్సర్లు పనిచేయకపోయినా, ల్యాండ్ కాగలం. రెండు ఇంజిన్లు విఫలమైనా మేం సురక్షితంగా ల్యాండ్ చేయగలం. ఈసారి డిజైన్ చాలా జాగ్రత్తగా రూపొందించాం " అని వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)