ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో పార్టీ కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. అమరావతి రాజధానిగా మారబోతోందనే విషయంపై విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీలో సరికొత్త అమరావతిని నిర్మించామని, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాన్ని ధ్వంసం చేసిందని మండిపడ్డారు. అమరావతి చరిత్రను తాము తిరగరాశామని, అమరావతి పేరెత్తగానే స్వర్గం గుర్తుకొస్తుందని చంద్రబాబు వ్యాఖ్యానించారు. అలాంటి అమరావతిని చెడగొట్టడానికి వైఎస్ జగన్కు ఎలా బుద్ధొచ్చిందో తనకు అర్థం కావట్లేదని అన్నారు. అమరావతి ఎక్కడికీ పోదని, తొమ్మిది నెలల తరువాత మళ్లీ పరుగెత్తిస్తామని చెప్పారు. వైఎస్ జగన్కు ఎక్స్పైరీ డేట్ దగ్గరపడిందని, త్వరలోనే వెళ్లిపోతాడంటూ చంద్రబాబు అన్నారు. ఆరిపోయే దీపానికి వెలుగెక్కవ అన్నట్లు వైఎస్ జగన్ వ్యవహరిస్తోన్నాడంటూ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమరావతి చరిత్రను మళ్లీ తిరగరాస్తానని, దీన్ని ఎవరూ అడ్డుకోలేరని తేల్చి చెప్పారు. తన పరిపాలనలో అమరావతి ప్రపంచంలోనే అత్యుత్తమ నగరమౌతుందని అన్నారు.
అమరావతి చరిత్రను మళ్లీ తిరగరాస్తా !
June 10, 2023
0
Tags