ఇప్పటికే పప్పులు, ఉప్పులు, బియ్యం, వంటనూనె ధరల పెరుగుదలతో సతమతమౌతున్న సామాన్యులకు కూరగాల భారం నెత్తిన పడింది. అయితే రోజులు గడితే కొద్ది ఈ జాబితాలో చేరుతున్న వస్తువుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గత కొద్ది రోజులుగా దేశంలో టమాటా, పచ్చిమిర్చి వంటి కూరగాయల విపరీతంగా ధరలు పెరగగా రానున్న రోజుల్లో వంటగది బడ్జెట్ మరింత పెరగనుంది. ఇప్పుడు మసాలా దినుసుల్లో ముఖ్యమైన జీలకర్ర ధరల షాక్ ఇవ్వటానికి సిద్ధమైంది. ప్రస్తుతం దేశంలోని అనేక ప్రాంతాల్లో కిలో జీలకర్ర ధర రూ.700కి చేరుకుంది. దీని రేటు డ్రైఫ్రూట్స్ లో ఒకటైన బాదంపప్పులతో పోటీ పడుతోంది. హోల్ సేల్ మార్కెట్లో క్వింటా జీలకర్ర రేటు రూ.57,500 పలకటం ఆందోళనలు కలిగిస్తోంది. గడచిన వారం రోజుల్లో జీలకర్ర ధర కిలోకు రూ.150 నుంచి రూ.175 మేర పెరిగిందని వ్యాపార వర్గాలు వెల్లడించాయి. గత బుధవారం రాజస్థాన్లోని నాగౌర్ మండిలో జీలకర్రను హోల్సేల్లో క్వింటాల్ రూ.57,500కు విక్రయించారు. ఇప్పటి వరకు ఇదే అత్యధిక ధర అని వెల్లడైంది. గుజరాత్లో బీపర్జోయ్ తుపాను తర్వాత మార్కెట్లకు జీలకర్ర రాక గణనీయంగా తగ్గిందని దీని కారణంగా రేట్లు పెరగటం ప్రారంభమైందని కమోడిటీ నిపుణుడు బీరెన్ వాకిల్ తెలిపారు.
ప్రస్తుతం ఉంజాలో జీలకర్ర రోజుకు 4000-5000 బస్తాలు వస్తుండగా, డిమాండ్ రెండింతలు ఉందని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ స్పైస్ స్టేక్హోల్డర్స్ డైరెక్టర్ విజయ్ జోషి తెలిపారు. టర్కీ, సిరియాలో పండే జీలకర్ర వచ్చే నెలలో ప్రపంచ మార్కెట్లోకి వస్తుంది. కొత్త సీజన్ స్టాక్ రావడానికి ఇంకా ఎనిమిది నెలల సమయం ఉంది. దీనికి తోడు ఏటా శంలో ఏటా 35 లక్షల జీలకర్ర బస్తాలు అవసరం కాగా ప్రస్తుతం దేశంలో 15 లక్షల బస్తాలు మాత్రమే అందుబాటులో ఉండడంతో డిమాండ్, ధర రెండూ అధికంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు.