తెలంగాణలోని మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేట మండలం కొత్తకొమ్ముగూడెంకు చెందిన ఒగేటి సాయి (24) నిర్మల్ మండలం కొండాపూర్లో విద్యుత్ శాఖలో జేఎల్ఎంగా పనిచేస్తున్నాడు. అతడికి ఈ నెల 12 పెళ్లి జరగాల్సి ఉంది. గురువారం ఉదయం కొత్త కొమ్ముగూడెం నుంచి నిర్మల్కు వెళ్లాడు. పెళ్లి కోసం ఉద్యోగానికి సెలవు పెట్టాడు. అక్కడి మిత్రులు, తోటి ఉద్యోగులకు పెళ్లి పత్రికలు పంచి తన స్నేహితుడు మహేష్తో కలిసి మోటార్సైకిల్పై రాత్రి ఇంటికి బయల్దేరాడు. ఈ క్రమంలో దండేపల్లి మండలం మేదరిపేట సినిమా థియేటర్ సమీపంలో లక్సెట్టిపేట వైపు వెళ్తున్న హార్వెస్టర్ వీరి మోటార్సైకిల్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇద్దరూ కిందపడిపోయారు. సాయి తలకు తీవ్ర గాయాలు కావడంతో లక్సెట్టిపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్దారించారు. మహేష్కు తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి సత్తయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
హార్వెస్టర్ ఢీకొని యువకుని దుర్మరణం
May 06, 2023
0
Tags