లిఫ్ట్‌లో ఇరుక్కున్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ !

Telugu Lo Computer
0


తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ రెస్టారెంట్ లిఫ్ట్‌లో ఇరుక్కుపోయారు. దీంతో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ శ్రేణులు, భద్రతా సిబ్బంది టెన్షన్ పడ్డారు. అయితే కాసేపటి తర్వాత మంత్రి లిఫ్ట్‌ నుంచి సురక్షితంగా బయటకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నిన్న ప్రభుత్వ కార్యక్రమాల్లో భాగంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ నుంచి మంచిర్యాల జిల్లాకు వెళ్లారు. మార్గమధ్యంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డితో కలిసి పెద్దపల్లి పట్టణంలో పర్యటించారు. ఈ క్రమంలో కూనరం చౌరస్తాలో బీఆర్ఎస్ నేత నిర్వహిస్తున్న రెస్టారెంట్ కు మంత్రి వెళ్లారు. కొద్దిసేపటికి రెస్టారెంట్ లో ఉన్న శ్రీనివాస్ గౌడ్ భవనం పైనుంచి కిందకు వస్తుండగా లిఫ్ట్ ఎక్కారు. అయితే లిఫ్ట్ లో సామర్థ్యానికి మించి ఉండటంతో డోర్స్ క్లోజ్ అయిన తర్వాత తిరిగి తెరుచుకోలేదు. దీంతో లిప్ట్ లో సాంకేతిక సమస్య తలెత్తి మధ్యలోనే ఆగిపోయింది. కాగా లిప్ట్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఇరుక్కుపోవడంతో అక్కడున్న వారంతా ఆందోళనకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు శ్రమించి లిఫ్ట్‌ తలుపులు తెరిచారు. దీంతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు లిఫ్ట్‌లోని వారందరూ బయటకు వచ్చారు. అందరూ సురక్షితంగా బయట పడటంతో ఊపిరి పీల్చుకున్నారు. మంత్రి మాట్లాడుతూ లిప్ట్ లో సామర్థ్యానికి మించి ఎక్కడంతోనే సమస్య తలెత్తిందని తెలిపారు. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తను సురక్షితంగానే ఉన్నాని అన్నారు. సామర్థ్యాన్ని మించడంతో సమస్య తలెత్తిందని స్పష్టం చేశారు. అక్కడి నుంచి మంత్రి తన కారులో చెన్నూరుకు బయలుదేరి వెళ్లారు.

Post a Comment

0Comments

Post a Comment (0)