లండన్లో శనివారం పట్టాభిషిక్తుడవుతున్న బ్రిటన్ రాజుకు ముంబయి డబ్బావాలాలు 'పునెరీ పగఢీ'ని (సంప్రదాయ తలపాగా) పంపారు. దీంతోపాటు మెడలో ధరించే కండువానూ (ఉపర్నీ) ఆయనకు పంపారు. మహారాష్ట్రలోని పుణె నగరంలో 19వ శతాబ్దం నుంచి హోదాకు, గౌరవానికి ప్రతీకగా పునెరీ పగఢీని ధరిస్తారు. సంప్రదాయ కార్యక్రమాల్లో పాల్గొనే సమయంలో ఉపర్నీని పురుషులు ధరిస్తారు. రాజు పట్టాభిషేకానికి తమను ఆహ్వానించలేదని, ఇటీవల ముంబయిలోని ఓ హోటల్లో జరిగిన కార్యక్రమానికి తమలో కొందరిని బ్రిటన్ దౌత్య అధికారులు పిలిచారని, ఈ సందర్భంగా వారికి పునెరీ పగఢీని, ఉపర్నీని అందజేశామని డబ్బావాలాల సంఘం అధ్యక్షుడు రాందాస్ కర్వాండే ముంబయిలో తెలిపారు. ముంబయి డబ్బావాలాలకు బ్రిటన్ రాజ కుటుంబంతో సుదీర్ఘకాలంగా సంబంధాలు కొనసాగుతున్నాయి. 2003లో ఛార్లెస్-3 భారత్ పర్యటనకు వచ్చినప్పుడు వారిని కలిసి సేవలను ప్రశంసించారు.
ఛార్లెస్కు డబ్బావాలాల 'పునెరీ పగఢీ'
May 05, 2023
0
Tags