ఎండకాలం - పోషక పచ్చళ్లు !

Telugu Lo Computer
0


ఎండకాలంలో మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, పుచ్చకాయ జ్యూస్ తాగితే మన శరీరానికి చలువ చేస్తాయి. కానీ వాటికి పోషక విలువలు జోడిస్తే మరింత రుచితో పాటు ఆరోగ్యం.  వీటిలో బెండకాయ పెరుగు పచ్చడి,దొండకాయ పెరుగు పచ్చడి, మామిడికాయ పెరుగు పచ్చడి లాంటివి చేసుకొని తింటే ఇంకా మంచిది. వాటిని ఎలా చేసుకోవాలో చూద్దాం. 

బెండకాయ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు బెండకాయలు పావు కిలో, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, పచ్చిమిర్చి, ఆవాలు, పసుపు, ఇంగువా, నూనె, ఉప్పు, చిక్కని పెరుగు( ఇవన్నీ తగిన మోతాదులో తీసుకోవాలి). ముందుగా బెండకాయలను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఆ తరువాత నూనెలో వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. మిక్సీలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం వీటిని వేసి మరి పేస్టులా కాకుండా కొద్దిగా బరకగా గ్రైండ్‌ చేసుకోవాలి. ఆ తరువాత ఒక ప్యాన్​లో చెంచా నూనె వేసి వేడెక్కాక ఆవాలు వేయాలి. అవి వేడిక్కిన తరువాత దీనిలో ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న ముద్ద, ఇంగువ, పసుపు వేసి పచ్చివాసన పోయేంతవరకూ వేగనివ్వాలి. స్టౌ కట్టేసి కాస్త చల్లారనిచ్చి బెండకాయ ముక్కలు, కప్పు పెరుగు, తగినంత ఉప్పు వేసుకుంటే నోరురూరించే బెండకాయ పెరుగు పచ్చడి రెడీ.

దొండకాయ పెరుగు పచ్చడికి కావాల్సినవి: గండ్రంగా తరిగిన దొండకాయల ముక్కలు, వాటికి తగినట్లుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, నూనె, ఆవాలు, ఎండు మిర్చి, కరివేపాకు, పసుపు, ఉప్పు, చిలికిన పెరుగు, నీళ్లు. మిక్సీలోకి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత స్టౌపై కళాయిలో నూనె పోసి వేడి చేసుకోవాలి. అందులో పోపు దినుసులు వేయాలి. అప్పుడు వాటికి ఎండుమిర్చి, కరివేపాకు వేసి తగిన మంటలో వేయించాలి. తర్వాత దొండకాయ ముక్కలు, పసుపు వేయాలి. దొండకాయ ముక్కలు బాగా వేగనివ్వాలి. తరువాత ఉప్పు, ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్‌ అందులో వేసి కలపాలి. 2 నిమిషాలు వేయించిన తరువాత తీసివేయాలి. దొండకాయ ముక్కలు చల్లారాక చిలికిన పెరుగు, కాసిని నీళ్లు వేసి కొద్దిగా కలపాలి. మీకు ఇష్టమైన దొండకాయ పచ్చడి తయారీ అవుతోంది. అది వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. 

మామిడికాయ పెరుగు పచ్చడికి కావాల్సినవి: పెరుగు కొద్దిగా, పచ్చి మామిడికాయ ఒకటి, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, ఉప్పు రుచికి తగినంత, ఆవాలు, మినపప్పు, ఎండుమిర్చి, ఇంగువ, కరివేపాకు, నూనె (తగినంతగా తీసుకోవాలి) ముందుగా ప్యాన్​లో నూనె వేసుకొని.. నూనె కాగిన తరువాత ఆవాలు వేయాలి. దాంట్లో కొద్దిగా ఇంగువా, మినపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఉల్లి, పచ్చిమిర్చి కాసేపు వేగనివ్వాలి. ఆ తరువాత అందులో మామిడి ముక్కలు, పసుపు వేసి మరికాసేపు స్టౌపై ఉంచాలి. దీనికి తగినంత ఉప్పు వేసి మంట తగ్గించుకోవాలి. అప్పుడు చిలికిన పెరుగు, కాసిని నీళ్లు కలిపి స్టౌ ఆపేయాలి. చివరగా కొత్తిమీర వేస్తే మామిడికాయ పెరుగు పచ్చడి సిద్దమవుతుంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)