నియామకాల విధానంలో సమూల మార్పులతో అవినీతి అంతం చేశాము !

Telugu Lo Computer
0


ఉద్యోగ నియామకాల విధానంలో తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకురావడంతో అవినీతి, బంధుప్రీతికి ఎక్కడా అవకాశం లేకుండా అంతమయ్యాయని ప్రధాని నరేంద్రమోడీ స్పష్టం చేశారు. రోజ్‌గార్ మేళా సందర్భంగా దేశ వ్యాప్తంగా 71,000 ఉద్యోగ నియామక పత్రాలను మంగళవారం ప్రధాని మోడీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత తొమ్మిదేళ్లుగా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం ఉద్యోగ నియామక అవకాశాలు, మౌలిక సదుపాయాలు విస్తృత పర్చడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకోవడం దగ్గర నుంచి ఫలితాల ప్రకటన వరకు మొత్తం ప్రక్రియ అంతా ఆన్‌లైన్ అయిందని చెప్పారు. ఈరోజు ప్రాముఖ్యత గురించి వివరిస్తూ తొమ్మిదేళ్ల క్రితం మే 16న లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదలయ్యాయని, అలాగే ఈరోజు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవమని గుర్తు చేశారు. "సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్‌" నినాదం స్ఫూర్తితో తమ ప్రయాణం ప్రారంభమైందని చెప్పారు. వాల్మార్ట్, యాపిల్, ఫాక్స్‌కాన్, సిస్కో వంటి ముఖ్యమైన గ్లోబల్ సంస్థల సీఈఒలతో ఇటీవల తాను నిర్వహించిన సమావేశాల్లో అపూర్వ సానుకూలత లభించిందని, మనదేశంలో పెట్టుబడులు పెట్టి పరిశ్రమలు స్థాపించడానికి అనుకూలంగా ఉన్నారని పేర్కొన్నారు. ఇపిఎఫ్‌ఒ (ఉద్యోగుల భవిష్య నిధి ) గణాంకాల ప్రకారం 201819 నుంచి దేశంలో 4.5 కోట్ల మంది ఉద్యోగాలు పొందారని స్పష్టమైందని చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, రికార్డు స్థాయిలో ఎగుమతుల వల్ల దేశం నలుమూలలా ఉద్యోగ అవకాశాలు లభిస్తున్నాయని, అభివృద్ధి చెందుతున్న రంగాలకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుండడంతో ఉద్యోగాల స్వభావమే మారుతోందన్నారు. అంకుర పరిశ్రమల రంగంలో దేశం విప్లవాత్మక మార్పులను చూస్తోందని, 2014 కు ముందు కొన్ని వందల సంఖ్యలో అంకుర పరిశ్రమలు ఉండగా, ఇప్పుడు వాటి సంఖ్య లక్షకు చేరిందని వీటివల్ల కనీసం 10 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. కొత్త ఉద్యోగాల కనీస వసతుల కోసం మూలధన వ్యయం నుంచి రూ. 34లక్షల కోట్లు ఖర్చు చేయడమైందని, మరో రూ. 10 లక్షల కోట్లు ఈ ఏడాది బడ్జెట్‌లో కేటాయించడమైందని వివరించారు. గత తొమ్మిదేళ్లలో 40,000 కిమీ పొడవునా రైల్వేలైన్లు విస్తరించాయని, అంతకు ముందు 70 ఏళ్లలో కేవలం 20,000కిమీ లైన్లే ఏర్పడ్డాయని పోల్చి చెప్పారు. అలాగే గ్రామీణ రోడ్ల పొడవు 4 లక్షల కిమీ నుంచి 7.25లక్షల కిమీ కు పెరిగిందన్నారు. విమానాశ్రయాల సంఖ్య 74 నుంచి 150 కి పెరిగిందని తెలిపారు. గృహ నిర్మాణ పథకం కింద పేదలకు 4 కోట్లకు పైగా ఇళ్లు నిర్మాణమయ్యాయని, పేదలకు కూడా భారీగా ఉపాధి అవకాశాలు పెరిగాయని చెప్పారు. 2014లో యూనివర్శిటీలు 720 ఉండగా, ఇప్పుడు 1100 కు పెరిగాయని, అలాగే 400 నుంచి 700 మెడికల్ కాలేజీలు పెరిగాయని వివరించారు. సాంకేతిక సౌకర్యాలు అభివృద్ధి చెందడంతో ప్రజల జీవితాలు సులభసాధ్యమయ్యాయని పేర్కొన్నారు. పట్టణ గ్యాస్ పంపిణీ వ్యవస్థ 60 నుంచి 600 పట్టణాలకు విస్తరించిందన్నారు. 2014 నుంచి ముద్ర యోజన కింద ప్రజలకు చిన్నతరహా వ్యాపారాలు నెలకొల్పుకునేలా రూ.23 లక్షల కోట్ల రుణాలు పంపిణీ చేయడమైందని చెప్పారు. ఈ రుణాలు వినియోగించుకుని దాదాపు ఎనిమిది కోట్ల నుంచి 9 కోట్ల మంది వరకు ప్రజలు మొట్టమొదటిసారి వ్యాపారాలు నెలకొల్పుకోగలిగారని వివరించారు. తయారీ రంగం ద్వారా ఉపాధి కల్పించాలన్న లక్షంతో అమలు చేస్తున్న ఆత్మ నిర్భర్ భారత్ నినాదంతో ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహ పథకం (పిఎల్‌ఐ) కింద రూ. 2 లక్షల కోట్ల సాయం అందించినట్టు తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)