రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా !

Telugu Lo Computer
0


తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు డిప్యూటీ మేయర్, బాబాయ్ రూప్ కుమార్‌, అనిల్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. దీంతో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇద్దరిని పిలిచి మాట్లాడారు. ఇది జరిగిన రెండు రోజులకే ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. రూప్ కుమార్‌తో తాను కలవలేనని, ఇక ఎప్పటికీ కలిసేది లేదని తెగేసి చెప్పారు. అంతేకాదు తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని చెప్పారు. కాగా నెల్లూరులో ఎమ్మెల్యే అనిల్, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ మధ్య చాలా కాలంగా విభేదాలున్నాయి. డిప్యూటీ మేయర్ రూప్ కుమార్, ఎమ్మెల్యే అనిల్ కుమార్‌కు సొంత బాబాయే. 2014, 2019 ఎన్నికల్లో అనిల్ కుమార్ యాదవ్ గెలుపు కోసం బాబాయ్ రూప్ కుమార్ చాలా కృషి చేశారు. ఆ తర్వాత అనిల్ కుమార్ యాదవ్ మంత్రి అయ్యారు. నెల్లూరు నియోజకవర్గం బాధ్యతలు డిప్యూటీ మేయర్, బాబాయ్ రూప్ కుమార్ చూసుకునే వారు. అయితే వీరి మధ్య వర్గ పోరు తలెత్తడంతో యడమొహం పెడమొహంగా ఉంటున్నారు. అనిల్‌కు పోటీగా సొంత పార్టీ కార్యాలయాన్ని రూప్ కుమార్ నిర్మించుకున్నారు. అటు అధికార కార్యక్రమాలకు సైతం ఒకరు హాజరైతే మరొకరు హాజరుకానంత వరకూ పరిస్థితి వెళ్లింది. అంతేకాదు వీరి మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది.  నేపథ్యంలో సీఎం జగనే స్వయంగా రంగంలోకి దిగారు. రెండు రోజుల క్రితం ఇద్దరితో మాట్లాడారు. ఇంతలోనే ఎమ్యెల్యే అనిల్ కుమార్ యాదవ్ తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానంటూ ప్రకటించారు. దీంతో నెల్లూరు వైసీపీ నాయలకులు షాక్‌కు గురయ్యారు. అనిల్ తో మాట్లాడేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. మరి బుజ్జగింపుల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి. 

Post a Comment

0Comments

Post a Comment (0)