పిల్లాడ్ని నేలకేసి కొట్టిన తండ్రి !

Telugu Lo Computer
0


మహారాష్ట్రలోని ముంబైలో చంద్రిక సాహా అనే నటి అదాలత్‌, సీఐడీ, సావధాన్‌ ఇండియా: క్రైమ్‌ అలర్ట్‌ వంటి టీవీ షోలలో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. గతంలో ఒకరిని పెళ్లి చేసుకున్న ఈమె మనస్పర్థల కారణంగా విడాకులిచ్చింది. తిరిగి తన కెరీర్‌పై దృష్టి సారించిన సాహాకు 2020లో అమన్‌ మిశ్ర అనే వ్యాపారవేత్తతో పరిచయం ఏర్పడింది. కొన్ని రోజుల్లోనే అది ప్రేమగా మారడంతో ఇద్దరు సహజీవనం చేశారు. ఈ క్రమంలోనే సాహా గర్భం దాల్చింది. ఈ విషయం చెప్తే అమన్ ఆనందపడతాడని భావిస్తే, అందుకు భిన్నంగా అతడు అబార్షన్ చేసుకోవాల్సిందిగా సాహాపై ఒత్తిడి చేశాడు. కానీ అందుకు ఆమె అంగీకరించలేదు. ఈ విషయంలో ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. పిల్లాడు పుట్టిన తర్వాత కూడా ఇద్దరి మధ్య గొడవలు సద్దుమణగలేదు. చివరగా అమన్ వెనక్కు తగ్గి పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకోవడంతో గత నెలలో వాళ్లు పెళ్లి చేసుకున్నారు. ఆ సమయానికి బాబు వయసు 14 నెలలు. పెళ్లి అవ్వడం, అమన్ కూడా తనతో ప్రేమగా ఉండటంతో ఇక తన దాంపత్య జీవితం సాఫీగా సాగుతుందని సాహా ఆశపడింది. కానీ, నెల రోజుల్లోనే అమన్ తన రాక్షసబుద్ధి చూపించాడు. శుక్రవారం పిల్లాడిని ఆడించమని చెప్పి సాహా కిచెన్‌లోకి వెళ్లింది. కుమారుడ్ని తీసుకొని అమన్ బెడ్రూంలోకి వెళ్లాడు. కొన్ని నిమిషాల తర్వాత సాహాకు బాబు ఏడుపు వినిపించింది. బెడ్రూంలోకి వెళ్లి చూడగా పిల్లాడి శరీరంపై గాయాలు కనిపించాయి. ఎలా జరిగిందని ప్రశ్నిస్తే పిల్లాడు ఆడుతూ కిందపడ్డాడని అమన్ సమాధానం ఇచ్చాడు. దీంతో వెంటనే ఆసుపత్రిలో చేర్పించి, బాబుకి చికిత్స అందించారు. అయితే.. సాహాకు అనుమానం వచ్చి సీసీటీవీ పరిశీలించింది. అందులో తన భర్తే కొడుకును మూడుసార్లు నేలకేసి కొట్టడాన్ని చూసి ఆమె ఖంగుతింది. ఈ వీడియో ఆధారంగా ఆమె తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)