నైతిక బాధ్యతతో తాను రాజీనామా చేసినట్టే ప్రస్తుత ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సైతం రాజీనామా చేయాలని శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే చేసిన వ్యాఖ్యలకు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ కౌంటర్ అటాక్ చేశారు. షిండేను రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదని పవార్ అన్నారు. అంతే కాకుండా కలలో కూడా షిండే రాజీనామా చేయరని తమకు తెలుసని అన్నారు. మాజీ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి కి ప్రస్తుత నాయకులకు చాలా తేడా ఉందని పవార్ అన్నారు. శివసేన రెండు వర్గాల మధ్య తలెత్తిన వివాదంపై సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చిన మరుసటి రోజే ఉద్ధవ్ థాకరే తమ ప్రత్యర్థి వర్గమైన ఏక్నాథ్ షిండేకు, బీజేపీకి సవాల్ విసిరారు. తాజా ఎన్నికలకు వెళ్దామని ఛాలెంజ్ చేశారు. ”మనమంతా తాజా ఎన్నికలకు వెళ్దాం. ప్రజలే అంతిమ నిర్ణయం తీసుకుంటారు. నేను రాజీనామా ఇచ్చినట్టే, నైతిక బాధ్యత వహించి సీఎం కూడా రాజీనామా చేయాలని ఉద్ధవ్ అన్నారు. గత ఏడాది తిరుగుబాటు చేసి తన ప్రభుత్వం పడిపోవడానికి కారణమైన శివసేన ఎమ్మెల్యేలను అసెంబ్లీ స్పీకర్ అనర్హులుగా ప్రకటించాలని, దీనిపై తగిన నిర్ణయం తీసుకోకుంటే మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన చెప్పారు. ఇక మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారి నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో ఆయనపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఉద్ధవ్ థాకరే డిమాండ్ చేశారు. ఒకరిపై చర్యలు తీసుకుంటే ఇతరులు ఇలాంటి చట్టవిరుద్ధమైన పనులు చేయరని ఆయన అన్నారు. ''గవర్నర్కు విచక్షణాధికారం చట్టం ప్రకారం లేదు. ఉద్దవ్ ఠాక్రే స్వచ్ఛందంగా సమర్పించిన రాజీనామాను కోర్టు రద్దు చేయదు. సభలో మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా థాకరేను గవర్నర్ పిలవడం సమర్థనీయం కాదు'' కోర్టు తెలిపింది. అలాగే గోగ్యాలేను స్పీకర్ విప్గా నియమించడం చెల్లదని సైతం సుప్రీంకోర్టు తెలిపింది.
షిండేను రాజీనామా చేయాలని డిమాండ్ చేయాల్సిన అవసరం లేదు !
May 12, 2023
0
Tags